
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ కోణంలో భాగంగా ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సోమవారం (జూన్ 2) జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్లను కోల్కతా నుంచి తరలించాలనే నిర్ణయం రాజకీయ ప్రేరేపితమని వస్తున్న ఆరోపణలను ఖండించారు. వేదిక మార్పు వెనక ఎలాంటి రాజకీయం కోణం లేదని ఆయన స్పష్టం చేశారు.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు లేకపోతే.. మే 25న కోల్కతాలో ఫైనల్, హైదరాబాద్లో ప్లేఆఫ్ మ్యాచులు జరిగేవన్నారు. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఫ్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలను మార్చాల్సి వచ్చిందని.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా మేము చాలాసార్లు వేదికలను మార్చాల్సి వచ్చిందని.. ఇది కొత్తేమీ కాదని అన్నారు. ఇక్కడ ఎటువంటి రాజకీయ కుట్ర లేదని.. అలాంటిదే ఉంటే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోల్కతాలో ఎందుకు నిర్వహిస్తామన్నారు.
పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ షెడ్యూల్ సవరించాల్సి వచ్చిందని.. సవరించిన షెడ్యూల్ ప్రకారం కోల్కతాలో వాతావరణం అనుకూలంగా లేదని.. భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో తమకు భారీ నష్టం జరుగుతుందని బ్రాడ్ కాస్టర్ కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించామని వివరించారు. ఫైనల్ మ్యాచ్ కోసం వర్షపాతం తక్కువగా ఉండే వేదికను ఎంపిక చేయాలని బ్రాడ్ కాస్టర్ అభ్యర్థించారని.. దీంతో ఢిల్లీ, లక్నో, చెన్నై, బెంగళూరు, కోల్కతా, చండీగఢ్, అహ్మదాబాద్లతో సహా పలు వేదికలను పరిశీలించామని పేర్కొన్నారు.
ఇందులో చండీగఢ్, అహ్మదాబాద్లలో వర్షపాతం తక్కువగా ఉందని వాతావరణ నివేదికలు సూచించడంతో మ్యాచ్లను ఈ నగరాలకు మార్చాలని నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే, క్వాలిఫయర్ 2 మ్యాచ్ సంద్భరంగా భారీ వర్షం రావడంతో దాదాపు ముంబై, పంజాబ్ మ్యాచ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో బీసీసీఐపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
రాజకీయ కుట్రలో భాగంగా వర్షం పడే అవకాశం ఉందని తెలిసిన వేదికను కోల్కతా నుంచి అహ్మదాబాద్కు మార్చారని పలువురు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ కూడా ఇవే తరహా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వేదిక మార్పుపై వస్తోన్న ఆరోపణలను బీసీసీఐ తోసిపుచ్చింది. కాగా, 2025, జూన్ 3న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్ మధ్య ఐపీఎల్ ఫైనల్ పోరు జరగనుంది.