ఓరుగల్లులో లాండ్​పూలింగ్​ రద్దయినట్టా.. కానట్టా?

ఓరుగల్లులో లాండ్​పూలింగ్​  రద్దయినట్టా.. కానట్టా?
  • ఓరుగల్లులో లాండ్​పూలింగ్​  రద్దయినట్టా.. కానట్టా?
  • టెంపరరీగా హోల్డ్​ చేశామన్న కుడా వైస్​చైర్​పర్సన్​ 
  • జీఓ 80ఏ ను శాశ్వతంగా రద్దు చేయాలని రైతుల పోరుబాట
  • ఊరూరా మీటింగ్​లు, తీర్మానాలు

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో ల్యాండ్‍ పూలింగ్‍ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోలేదు. పదిరోజులపాటు రైతులు ఉద్యమాలు చేయడంతో  వారి భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు  ఉమ్మడి జిల్లా  ఎమ్మెల్యేలు, కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) చైర్మన్ ప్రకటించగా..  లాండ్ పూలింగ్ అంశాన్ని  ‘టెంపరరీ హోల్డ్’లో పెట్టినట్టు వైస్​చైర్​పర్సన్​జారీ చేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. . ఎమ్మెల్యేలు, ‘కుడా’  చైర్మన్‍ మాటలకు పూర్తి భిన్నంగా ‘కుడా’ వైస్ చైర్​పర్సన్​ప్రకటన ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. లాండ్​పూలింగ్​కోసం జారీ చేసిన జీఓ నంబర్‍ 80ఏను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరాటాన్ని ప్రారంభించారు.  

'కుడా' ద్వారా  21,510 ఎకరాల భూములను రైతులనుంచి సేకరించి అభివృద్ధి చేస్తామని ఏప్రిల్‍ 30న ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వరంగల్‍, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 50 గ్రామాల్లో లాండ్ పూలింగ్​ చేయనున్నట్టు, అభ్యంతరాలుంటే 30 రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేయాలని సర్కారు ప్రకటించింది.  తమ భూములు లాక్కోవద్దని ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మొరపెట్టుకోవడంతోపాటు కుడా ఆఫీసులో  వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కుడా వెనక్కి తగ్గకపోవడంతో  రైతులు పోరుబాట పట్టారు. వరంగల్ కార్పొరేషన్‍, కలెక్టరేట్‍, కుడా ఆఫీసులను ముట్టడించారు. దీంతో టీఆర్‍ఎస్‍ లీడర్లు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  హరీశ్​రావు జిల్లా టూర్​ సందర్భంగా కూడా రైతులు ధర్నా చేశారు. 

ఊరూరా తీర్మానాలు.. శాంతియుత ఆందోళనలు 
జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్రం కావడంతో  రాష్ట్ర సర్కారు ల్యాండ్ పూలింగ్‍  నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ నెల 11న ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్‍ సుందర్‍రాజ్‍ ల్యాండ్‍ పూలింగ్‍ ప్రక్రియను పూర్తిస్థాయిలో రద్దు చేసినట్లు ప్రకటించగా.. రైతులు సంబురపడ్డారు. రైతులకు భూసేకరణపై అవగాహన కల్పించేవరకు ఈ అంశాన్ని 'టెంపరరీగా హోల్డ్​’ లో పెట్టినట్టు కుడా వైస్‍ చైర్​పర్సన్​ప్రావీణ్య ప్రకటించడంతో రైతులు మళ్లీ  పోరాటానికి సిద్ధమయ్యారు. వారం రోజుల నుంచి రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా  సమావేశాలు జరుగుతున్నాయి.  ల్యాండ్‍ పూలింగ్‍ కోసం ఇచ్చిన జీఓ 80ఏ ను  శాశ్వత రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఈ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఆరెపల్లి, కొత్తపేట, పైడిపల్లిల్లో ఆరునెలల కిందటే  భూసేకరణ ప్రక్రియ రద్దు చేస్తునట్టు చెప్పినా లాండ్​పూలింగ్​ జీఓ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వరంగల్‍, గీసుగొండ, ఐనవోలు, స్టేషన్‍ ఘన్‍పూర్‍ మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో మీటింగులు పెట్టి తీర్మానం చేశారు. జీఓ రద్దు చేయాలంటూ గాంధీ విగ్రహాల దగ్గర నిరసనలు తెలిపారు.  జీఓను సర్కారు పూర్తిగా రద్దు చేయకపోతే  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల లీడర్లు అంటున్నారు.  

లాండ్​పూలింగ్​ జీఓ రద్దు చేయాలి
ల్యాండ్ పూలింగ్ జీవో 80ఏను  ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేయాలని  రైతు ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం హసన్ పర్తి మండలంఆరెపల్లిలో నేషనల్​హైవే పై ఆందోళన చేపట్టారు. రెండు మూడు పంటలు పండే  భూములను రియల్​ ఎస్టేట్ కోసం లాక్కోవడం ప్రభుత్వానికి తగదని  రైతు జేఏసీ జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న అన్నారు. దొంగ సర్వేలను అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మట్టిబిడ్డలం కాబట్టి  భూమిని వదులుకునేదిలేదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ జీఓ 80ఏ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ బుద్దె శ్రీనివాస్, రైతు సంఘాల నేతలు నర్సింగుల సూరి, మద్ది మల్లయ్య, బుద్దె ఈశ్వర్, కంటివాడ బాపురావుతదితరులు పాల్గొన్నారు.

స్పష్టత ఇవ్వాలి 
ల్యాండ్‍పూలింగ్‍ రద్దుపై స్పష్టత లేదు. ఎమ్మెల్యేలు, కుడా  చైర్మన్  రద్దు చేసినట్టు చెప్తే.. కుడా ఆఫీసర్లు తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించారు. ల్యాండ్‍ పూలింగ్‍ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం వెంటనే జీఓ జారీ చేయాలి. లేకపోతే మళ్లీ పోరుబాట పడతాం.  - బుద్దె వెంకన్న,  కన్వీనర్‍, రైతు జేఏసీ