శశికళకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులు సీజ్

శశికళకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులు సీజ్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి,అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఊహించని షాక్ ఎదురైంది. ఆమెకు చెందిన 11 ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని పయనూర్ గ్రామంలోని 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్తులు ఉన్నాయి. జయలలిత సీఎంగా ఉన్న 1991-1996 మధ్యకాలంలో ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి విలువ రూ. 20 లక్షలు. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2014లో  కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిఖాయెల్ కున్హా ఈ ఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చారు. ఆ అక్రమాస్తులు జయలలిత, శశికళకు చెందినవని తెలిపారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ నిరోధక చట్టం కింద ఐటీశాఖ ఇవాళ(బుధవారం) ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అంటించారు. 

అయితే..ఈ ఆస్తులను శశికళ ఉపయోగించుకోవచ్చు, కానీ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపడానికి మాత్రం వీలులేదు.