10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు : మంత్రి పొన్నం

10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు : మంత్రి పొన్నం

బండి సంజయ్ పై విమర్శలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పి కట్టలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారని ప్రశ్నించారు. కరీంనగర్ పట్టణంలో వేల మంది ఇళ్లు లేని వారు ఉన్నారని అందులో ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.  కరీంనగర్ కోతి రాంపూర్ లోని గిద్దే పెరుమాండ్ల కమాన్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 కరీంనగర్  ఎమ్మెల్యేకి డంప్ యార్డు తీసేసి శక్తి లేదా..? అని ప్రశ్నించారు. తమకు అవకాశం ఇవ్వండి డంప్ యార్డు తీసేస్తామని తీసేసిన తరువాతనే ఓట్లు అడుగుతామని వెల్లడించారు. వినోద్ కుమార్ వరంగల్ నుండి వచ్చి కరీంనగర్ లో పెద్దరికం చేస్తున్నారని  కరీంనగర్ తో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తాము నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. 

తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  అమలు చేసామని చెప్పారు.  గతంలో 1200 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ అందించామని అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారిని గెలిపించండని పొన్నం ప్రభాకర్ కోరారు.