
- మార్చిలో 61 కేసులు.. ఆగస్టులోనే 60 వేలు
- మార్చిలో ఇద్దరు మృతి.. ఇప్పుడు రోజుకు పది మంది
- మొన్నటి దాకా హైదరాబాద్ లో.. ఇప్పుడు జిల్లాల్లో ఎక్కువ కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి కరోనా మహమ్మారి ఎంటరై ఆర్నెల్లు అయింది. వేగంగా విస్తరిస్తూ లక్షల మందికి అంటుకుంది. ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రతాపం చూపుతూ వందల మందిని పొట్టనబెట్టుకుంది. మార్చిలో హైదరాబాద్లో మొదలై ఇప్పుడు రాష్ర్టంలోని మారుమూల ప్రాంతాల వరకు విస్తరించింది. తొలి నెలలో కేవలం 61 కేసులు నమోదైతే, ఆరో నెలలో 60 వేల కేసులు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకూ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంది. ఫిబ్రవరిలోనే మన రాష్ర్టంలో కరోనా అలజడి మొదలైంది. ఆఫీస్ పని మీద దుబాయికి వెళ్లి, ఫిబ్రవరి చివరి వారంలో హైదరాబాద్కు తిరిగొచ్చిన వ్యక్తికి మార్చి రెండో తేదీన చేసిన టెస్టులో వైరస్ కన్ఫామ్ అయింది. రాష్ట్రంలో ఇదే తొలి కేసు. తర్వాత మార్చి 12 వరకు కేసులు రాలేదు. మార్చి 13న రెండు కేసులొచ్చాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా రోజూ వందల్లో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.
ఫిబ్రవరి, మార్చిలో కరోనాపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. వూహాన్లో జనాలు రోడ్లపైనే చనిపోతున్నట్టు జరిగిన ప్రచారంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. మార్చి 16న కరీంనగర్లో మర్కజ్ బృందాన్ని గుర్తించడం, అందులో పది మందికి పాజిటివ్ రావడంతో జనాలు వణికిపోయారు. వైరస్ వేగంగా స్ర్పెడ్ అవుతుండటం, మెడిసిన్ లేకపోవడంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే అలర్ట్ అయి లాక్డౌన్ విధించాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ జరగ్గా, మార్చి 23 నుంచి రాష్ర్ట సర్కార్ లాక్డౌన్ విధించింది. జనాలు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఆ నెలలో కేవలం 61 కేసులులే వచ్చాయి. ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ లోకల్గా స్ర్పెడ్ అయింది. అక్కడికి వెళ్లొచ్చిన ఓ వ్యక్తి మార్చి 27న మరణించాడు. రాష్ర్టంలో ఇదే తొలి కరోనా మరణం. సీఎం కేసీఆర్ పిలుపుతో ఏప్రిల్ మొదటి వారంలో మర్కజీలు దవాఖాన్లకు పోటెత్తారు. ఆ నెలలో ఏకంగా 977 కేసులు నమోదయ్యాయి.
లాక్డౌన్ తర్వాత..
మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం లాక్డౌన్ను పక్కాగా అమలు చేసింది. తర్వాతి నెలలో కొన్ని సడలింపులు ఇచ్చారు. మే చివరి నుంచి అన్లాక్ మొదలైంది. మే నెలలో 1,660 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం హైదరాబాద్లో నమోదైన కేసులే ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులు, హైదరాబాద్ నుంచి రాకపోకలు, ఇతర రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన మైగ్రెంట్స్ తో జూన్లో రాష్ర్టంలోని అని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది.
రోజుకు 10 మంది
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ర్టంలో కరోనాతో 827 మంది చనిపోయారు. మార్చిలో కేవలం ఇద్దరు చనిపోగా, ఏప్రిల్లో దాదాపు రోజుకు ఒకరు చొప్పున, మే నెలలో రోజుకు ఇద్దరు చొప్పున కన్నుమూశారు. జూన్లో ఏకంగా రోజుకు ఆరుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. జులైలో సగటున రోజుకు 9 మంది, ఆగస్టులో రోజుకు పది మంది కన్నుమూశారు. ఇలా ప్రతి నెల మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మొదట్లో డెత్ రేట్ 4 శాతం దాకా వెళ్లింది. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నా ఇప్పుడు కొంత తగ్గినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
కేసులు, మరణాలు సీక్రెట్
కరోనా టెస్టులు పెరగడంతో, కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. మరణాలు అదే స్థాయిలో పెరిగాయి. దీంతో కేసులు, మరణాలను తగ్గించేందుకు సర్కార్ దొడ్డిదారిని ఎంచుకుంది. కేసులు, మరణాల సంఖ్యను దాయడం ప్రారంభించింది. ఎంత దాచినా కేసుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంది. జులైలో ఏకంగా 48 వేలకుపై గా కేసులు వస్తే, ఆగస్టులో 60 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఇప్పుడు మొ త్తం కేసులు 1,24,963కు పెరిగాయి. లెక్కలోకి రాని కేసులు లక్షకుపైనే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
టెస్టులపై వివాదం
వైరస్ను కంట్రోల్ చేయడానికి వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలని డబ్ల్యూహెచ్వో, ఐసీఎంఆర్ సూచించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏప్రిల్ రెండో వారం నుంచే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయడం ఆపేశారు. దీంతో వైరస్ చాపకింద నీరులా స్ప్రెడ్ అయింది. జూన్ 15 వరకు రోజూ ఆరేడు వందల టెస్టులే చేస్తూ వచ్చారు. జనాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో జూన్ 16 నుంచి టెస్టుల సంఖ్య పెంచారు. దీంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య కూడా పెరిగింది. జూన్ తొలి 15 రోజుల్లో 2,495 కేసులు నమోదైతే, చివరి 15 రోజుల్లో ఏకంగా 11,146 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. టెస్టు చేసిన ప్రతి వందలో 24 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది.