- పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆఫీసర్లు, స్టూడెంట్లు
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కలగానే మిగిలింది. కాలేజీ ఏర్పాటుపై ఆఫీసర్లు గత పదేండ్లుగా మల్లగుల్లాలు పడుతున్నా.. ఆ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
అసలు కథ ఇదీ..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్ర శివారులో 2006లో తెలంగాణ యూనివర్సిటీని ప్రారంభించారు. ముందుగా సిటీలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో పీజీ సెంటర్ బ్లాక్లో రెండు పీజీ కోర్సులతో వర్సిటీని లాంఛనంగా షురూ చేశారు. తర్వాత 2009లో పూర్తి స్థాయి సౌకర్యాలతో పర్మినెంట్ యూనివర్సిటీకి అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. తొలుత 28 కోర్సులతో వర్సిటీ విద్యార్థులకు ఆడ్మిషన్లు ఇచ్చారు. రెండు కోర్సులతో స్టార్ట్ కాగా 2018 వరకు 28 కోర్సులు, 2019 లో 30 కోర్సులకు అప్ గ్రేడ్ చేశారు. ప్రస్తుతం వర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగాల్లో 30 కోర్సుల్లో 1,750 మంది స్టూడెంట్లు ఉన్నారు. టీయూలో మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో మొత్తం 30 డిపార్ట్మెంట్లలో 144 మంది లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం
మంజూరు చేసింది. అయితే 85 మంది అధ్యాపకులు నియమితులయ్యారు. వివిధ కారణాలతో కొందరు బదిలీలు, ప్రమోషన్లపై వెళ్లగా ప్రస్తుతం 69 మంది లెక్చరర్లు విద్యాబోధన చేస్తున్నారు. మొత్తం 30 డిపార్ట్మెంట్లలో 19 విభాగాలకే 144 అధ్యాపకుల పోస్టులు మంజూరు కాగా మిగితా 11 విభాగాలకు 100 పోస్టులు మంజూరు కాకపోవడంతో స్టూడెంట్లకు విద్యాబోధన సరిగా జరగడం లేదు. ఫలితంగా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదనలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు వర్సిటీ పరిధిలో బీఎడ్, ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఉండగా బీఎడ్ కాలేజీని అర్సపల్లిలో ఏర్పాటు చేశారు. గతంలో 2002లోనే జెఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజినీరింగ్కాలేజీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. 2004 అనంతరం ఈ ప్రతిపాదనలు అమోదించే వరకు వెళ్లాయి. కానీ యూనివర్సిటీల ఏర్పాటులో జిల్లాకు తెలంగాణ యూనిర్సిటీ మంజూరు పరిశీలనలో ఉండడంతో ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు ప్రతిపాదనలు ఫైల్కే పరిమితమయ్యాయి. గత పదేళ్లుగా ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుపై ప్రభుత్వ గ్రీన్సిగ్నల్ ఎప్పుడు ఇస్తుందని వర్సిటీ ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు.
స్టూడెంట్లపై ఫీజుల భారం
వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల స్టూడెంట్ల అటనామస్ యూనివర్సిటీ కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. దీంతో ఒక్కో స్టూడెంట్కు రూ. 6 లక్షల వరకు భారంపడుతుంది. టెన్త్తరువాత ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్చదువుతున్నారు. మరి కొందరు ఇంటర్పూర్తి చేసి ఎంట్రెన్స్తో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. వర్సిటీ పరిధిలోని జిల్లాల నుంచి 65 వేల మంది స్టూడెంట్లు ఇంజినీరింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. మెరుగైన ర్యాంక్ వచ్చిన స్టూడెంట్లు మినహాయిస్తే అధిక శాతం మంది మేనేజ్మెంట్ కోటాలో ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.2 లక్షల పేమెంట్తో చదువుకుంటున్నారు. మరికొందరు ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మన రాష్ట్రంలో 5 అటనామస్ యూనివర్సిటీల్లో అడ్మిషన్పొందుతున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు అకాడమీక్ ఇయర్కొల్పోవడం ఇష్టం లేక ఇతర కోర్సుల్లో చేరుతున్నారు.
స్టూడెంట్లు నష్టపోతున్నారు..
వర్సిటీలో ఇంజినీరింగ్కాలేజీ లేక స్టూడెంట్లు ఎంతో నష్టపోతున్నారు. కాలేజీ ఏర్పాటైతే స్టూడెంట్లు వివిధ రాష్ట్రాల్లో అటనామస్వర్సిటీల్లో లక్షల ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంజినీరింగ్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇయ్యాలి.
- నవీన్, ఏబీవీపీ లీడర్
చర్యలు తీసుకుంటున్నాం...
వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ముందుగా ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాల్సింది. 11 విభాగాల్లో 100 పోస్టులను మంజూరు చేయాలని ఉన్నత విద్యా మండలిని లేఖ రాశాం. ఉన్నత ప్రమాణాలతో కాలేజీ ఏర్పాటుకు అన్ని ప్రతిపాదనలు రెడీ చేశాం.
- శివశంకర్, టీయూ రిజిస్ట్రార్
ప్రైవేట్ లాబీయింగ్ జరుగుతోందా?
వర్సిటీ పరిధిలోని జిల్లాల్లో ఆరు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సుమారు 3,500 మంది స్టూడెంట్లు ఈ కాలేజీల్లో ప్రతి ఏడాది అడ్మిషన్ పొందుతారు. టీయూలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో కాలేజీ అందుబాటులో వచ్చే వరకు 4 ఏళ్ల తరువాత 3 వేల మంది స్టూడెంట్లు తగ్గవచ్చని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ మేనేజ్మెంట్ పెద్దలు లాబీయింగ్తో సర్కార్పై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలింతగానే ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.