
- జై జగన్నాథ్..
- పూరీలో ఘనంగా జగన్నాథుడి రథయాత్ర
- గుడీచా ఆలయానికి మూల విరాట్టులు
- వారం రోజుల తర్వాత మళ్లీ పూరీ ఆలయానికి
- దేశ, విదేశాల నుంచి భక్తుల రాక
- రథం లాగేందుకు పోటీపడిన యువత
- గుజరాత్లో జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు
- 9 మందికి గాయాలు.. హాస్పిటల్కు తరలింపు
పూరి: ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి పూరీలోని జగన్నాథ ఆలయం నుంచి 2.6 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్లారు. రథాన్ని లాగేందుకు వేలాది మంది పోటీపడ్డారు. రథం లాగడంతో పాపాలు తొలగి.. జగన్నాథుడి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసి పోయింది. ‘జై జగన్నాథ్’.. ‘హరిబోల్’.. నినాదాలతో పూరీ నగర వీధులన్నీ మారుమోగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ వేడుక కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్రకు సుమారు 12 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేసింది. సుమారు 10వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు విధులు నిర్వర్తించారు. సుమారు 275 ఏఐ బేస్డ్ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్పెషల్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రథయాత్ర రూట్ను డీజీపీ వైబీ ఖురానియా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
- ఏడు రోజులు గుండిచా ఆలయంలోనే విశ్రాంతి
సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. ఏటా కొత్త రథాలను తయారు చేయిస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవితో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.
- గుజరాత్లో జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగులు
అహ్మదాబాద్లోని గోల్వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకున్నది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు కోపంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు.. బయటకు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- నందిఘోష్పై జగన్నాథుడు
జగన్నాథుడు.. నందిఘోష్ రథంపై వెళ్లారు. ఈ రథం 16 చక్రాలతో 44.2 అడుగుల ఎత్తు ఉంటుంది. బలభద్రుడు తాళధ్వజ రథంపై ఊరేగారు. ఈ రథం 14 చక్రాలతో 43 అడుగుల ఎత్తు ఉంటుంది. సుభద్ర దరపదళన్ రథంపై గుడించా ఆలయానికి వెళ్లారు. ఈ రథం 12 చక్రాలతో 42 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా దసపల్లా అడవుల నుంచి సేకరించిన ధౌసా, ఫాసీ చెట్లతో ఈ రథాలను తయారు చేస్తారు. వంశపారంపర్య కార్పెంటర్లు సాంప్రదాయ పద్ధతులతో రథాలను సిద్ధం చేస్తారు.