
ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్ట్ తర్వాత వారం గ్యాప్ ఇరు జట్లు రెండో టెస్ట్ ఆడడానికి సిద్ధమవుతున్నాయి. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియాపై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టులోనూ గెలిచి భారత్ పై స్పష్టమైన ఆధిక్యం సంపాదించాలని ఇంగ్లాండ్ చూస్తుంటే.. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టులో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఒక కీలక మార్పుతో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయంగా మారింది.
రెండో టెస్టుకు బుమ్రా దూరం:
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్ట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వర్క్ లోడ్ కారణంగా సిరీస్ కు ముందే బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతానని చెప్పాడు. తొలి టెస్ట్ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ సైతం బుమ్రా మూడు టెస్టులు ఆడతాడని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటికే బుమ్రా ఒక టెస్ట్ ఆడాడు. మిగిలిన నాలుగు టెస్టుల్లో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ బుమ్రా రెండో టెస్ట్ కూడా ఆడితే అప్పుడు చివరి మూడు టెస్టుల్లో ఒకటే టెస్ట్ ఆడాలి. దీంతో ఈ గుజరాత్ పేసర్ కు రెండో టెస్టుకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు జట్టు యాజమాన్యం భావిస్తోందట.
లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో రోజు ఆటలో భాగంగా మూడు కీలక వికెట్లు తీసుకోగా.. మూడో రోజు మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 14 వ సారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
🚨 NO BUMRAH AT EDGBASTON. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 26, 2025
- Jasprit Bumrah likely to miss the 2nd Test Vs England due to workload management. He's set to play the 3rd Test. (Express Sports). pic.twitter.com/ET3cl6KwSZ
నాలుగేళ్ళ తర్వాత ఆర్చర్ రీ ఎంట్రీ..
ఇంగ్లాండ్ కు రెండో టెస్టుకు ముందు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ స్క్వాడ్ లో ఎంపికయ్యాడు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆర్చర్ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బొటన వేలి గాయం నుంచి కోలుకొని ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మ్యాచ్ ఆడాడు. చెస్టర్-లె-స్ట్రీట్లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ లో భాగంగా డర్హామ్తో జరిగిన మ్యాచ్లో ససెక్స్ తరపున ఈ స్పీడ్స్టర్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మే 2021 తర్వాత ఆర్చర్ తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇబ్బందిపడకుండా బౌలింగ్ చేసిన ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ స్పెల్ తో తాను రెండో టెస్టుకు రెడీ అని సంకేతాలు ఇచ్చాడు.
ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను 2021 ఫిబ్రవరిలో ఆడాడు. ఆ తర్వాత మోచేయికి శస్త్రచికిత్స చేపించుకొని సుదీర్ఘ ఫార్మాట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2023 లో జరిగిన యాషెస్ తో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. జూలై 2న ఎడ్జ్బాస్టన్లో భారత్తో ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్చర్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అనుభవం లేని ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్చర్ జట్టులోకి వస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ సమస్యలు తీరినట్టే.
BREAKING: Jofra Archer is back in England's Test squad for the first time since February 2021! 🚨 pic.twitter.com/BsXJILOIez
— ESPNcricinfo (@ESPNcricinfo) June 26, 2025