
కొలంబో వేదికగా సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య బుధవారం (జూన్ 25) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్టులో తొలి రోజు శ్రీలంక బౌలర్లు ఆధిపత్యం చూపించగా.. రెండో రోజు శ్రీలంక బ్యాటర్లు బంగ్లా బౌలర్ల భరతం పట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. క్రీజ్ లో పాతుం నిస్సాంక (146), ప్రబాత్ జయసూర్య (5) ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో భాగంగా ఒక అనూహ్య సంఘటన జరిగింది.
ALSO READ | ENG vs IND 2025: టీమిండియాతో రెండో టెస్ట్.. స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
తొలి రోజు ఆటలో భాగంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ గ్రౌండ్ వదిలి మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ స్థానంలో నాల్గవ అంపైర్ ప్రగీత్ రాంబుక్వెల్లా గ్రౌండ్ లోకి వచ్చాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. అలెక్స్ వార్ఫ్ ఆనారోగ్యంతో ఉండడంతో అతను గ్రౌండ్ లో ఉండలేకపోయాడు. 148 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అంపైర్ ఆట మధ్యలోనే వెళ్లిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అనారోగ్యంతో ఉన్న అంపైర్ త్వరగా కోలుకుని మైదానంలోకి తిరిగి రావాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 65 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. షాద్మాన్ ఇస్లామ్ (46), ముష్పికర్ రహీమ్ (35), లిటన్ దాస్ (34), మెహిదీ హసన్ మిరాజ్ (31) మెరుగ్గా ఆడటంతో తొలి రోజ ఆట ముగిసే టైమ్కు బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 220/8 స్కోరు చేసింది. రెండో రోజు మరో 27 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం మొదట ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. పాతుం నిస్సాంక ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేసి సత్తా చాటగా.. చండీమల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.