పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి.. కంటతడి పెట్టిస్తోన్న భర్తల రోదన

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి.. కంటతడి పెట్టిస్తోన్న భర్తల రోదన

గత రెండ్రోజులుగా తెలంగాణ సహ దేశవ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా, కైలాపూర్ వద్ద మిరప నారు నాటేందుకు వచ్చిన ఇద్దరు మహిళా కూలీలు సరిత(30), మమత(32) పిడుగుపాటుతో మృతిచెందారు. 

అప్పటివరకు తోటి వారితో ఇంటి కష్టనష్టాల గురుంచి చర్చించిన వారు ప్రకృతి ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోయారు. కాయకష్టాన్ని నమ్ముకుని వ్యవసాయ పనులకు వచ్చి విగత జీవులుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు అక్కడకి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. మమ్మల్ని వదిలిపోయావా! అంటూ భార్యల మృతదేహాలపై పడి భర్తలు భోరున విలపించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి.

రైతు మృతి

మరో ఘటనలో కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన రాజేశ్వర రావు(46) అనే రైతు పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లప్పుడూ పొలం పొలం అని పలికే ఆ ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోవడంతో.. మృతుని నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.