అప్పులతో అష్టకష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్ వేస్ ను ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆదుకుంది. రూ.2,050 కోట్ల లోన్ ఇవ్వడంతో ఈ కంపెనీ తాత్కాలికంగా కష్టాల నుంచి గట్టెక్కింది. ముంబైకి చెందిన జెట్ ఎయిర్ వేస్ ఫారిన్ కరెన్సీ టెర్మ్ లోన్గా రూ.1,100 కోట్లు, నాన్–ఫండ్ బేస్డ్ క్రెడిట్ గా రూ.950 కోట్లు పొందినట్టు పీఎన్బీ అధికారులు తెలిపారు. ఈ డబ్బును వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగిస్తారని లోన్ డాక్యుమెంట్లలో రాసి ఉన్నప్పటికీ, విమానాల అద్దెలు, పైలెట్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపునకే దీనిని వాడుతారని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లోన్ మొత్తాన్ని బకాయిల చెల్లింపునకు, అప్పులు తీర్చడానికి జెట్ ఎయిర్ వేస్ ఉపయోగిస్తే దీని క్రెడిట్ రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక అద్దెలు చెల్లించలేక నిలిపివేసిన విమానాలను తిరిగి నడపవచ్చు. గత నెల ఎనిమిది నుంచి ఈ కంపెనీ దాదాపు 49 విమానాల సేవలను నిలిపివేసింది.
‘‘మాకు అప్పులు ఇస్తున్న స్టేట్ బ్యాంకు నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్ షియంలో పీఎన్బీ ఒకటి. మా కంపెనీ సమస్యల పరిష్కారానికి కన్సార్ షియంలోని బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి’’ అని జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి చెప్పా రు. తాజా లోన్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు జెట్ ఎయిర్ వేస్ లో మైనారిటీ షేర్ హోల్డర్ ఎతిహాద్ ఎయిర్ వేస్ పీజీఎస్ సీ ప్రతినిధి స్పందిస్తూ జెట్ ఎయిర్ వేస్ బోర్డుతో, మేనేజ్ మెంట్ టీమ్ తో, భాగస్వాములతో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఐదేళ్లలో చెల్లించాలి..
ప్రస్తుతం రూపాయి విలువ రూ.70 దాటినప్పటికీ డాలర్ తో దీని మారక విలువను రూ.67గా లెక్కించి పీఎన్బీ లోన్ ఇచ్చింది. ఫలితంగా జెట్ ఎయిర్ వేస్ రూపాయల్లో ఉన్న అప్పులను సులువుగా తీర్చవచ్చు. ఐదేళ్లలో ఈ రెండు టర్మ్ లోన్లను చెల్లించాలి. వడ్డీరేట్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. రూ.750 కోట్ల లోన్కు ఏడాదికి 7.3 శాతం చొప్పున కట్టాలి. తదనంతరం ఈ రేటు మారుతుంది. రూ.300 కోట్ల లోన్కు ఆరు నెలలకు ఆరుశాతంచెల్లించాలి.