గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తం : తీన్మార్ మల్లన్న

గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తం : తీన్మార్ మల్లన్న
  •      ప్రజా ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుంది 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న తెలిపారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆదివారం హైదరాబాద్​లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్​ లెక్చరర్ల రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సర్కారు చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని, అందుకే ప్రజలు ఓడగొట్టారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అధికారంలోకి రాగానే విద్యారంగంపై అనేక సమీక్షలు చేస్తోందని గుర్తుచేశారు.

త్వరలోనే కాలేజీలు, స్కూళ్లు మంజూరు చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి గెస్ట్ లెక్చరర్లు తమ ప్రయత్నాలను ఆపొద్దని, ప్రతి ప్రయత్నానికి తాను అండగా ఉంటానని చెప్పారు. పీరియెడ్ విధానంతో గెస్ట్ లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ మాట్లాడుతూ..

పదేండ్లుగా సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్నా, ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం గెస్ట్ లెక్చరర్లని మినిమం టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గెస్ట్ లెక్చరర్లకు అండగా ఉంటామని కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్, ప్రొఫెసర్ జానయ్య, ఇందిరా శోభన్ తెలిపారు. మహేశ్, బండి కృష్ణ, బాబురావు, శ్రీవిద్య, అరుణ, సీహెచ్​ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.