
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం చేసిన రిస్క్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్నప్పటికీ జూన్ 3 వరకు ఇండియాలో ఉండడానికి నిర్ణయించుకున్నాడు. తమ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించడానికి ఆస్ట్రేలియా వెళ్లి కూడా ఇండియాకు రిటర్న్ వచ్చాడు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11 జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు తమ దేశానికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ ప్రారంభించేశారు.
ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో ఉన్న ఆటగాళ్లలో హేజల్ వుడ్ మాత్రమే ఇండియాలో ఉన్నాడు. సహచరుడు స్టార్క్ ఐపీఎల్ ఆడేందుకు తిరస్కరించినా.. హేజల్ వుడ్ మాత్రం జట్టుకు తన అవసరం ఉందని గుర్తించాడు. హాజిల్వుడ్ లాంటి స్టార్ ఫాస్ట్ దూరమవుతాడనే వార్తలు బెంగళూరు జట్టుతో పాటు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేశాయి. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన హాజిల్వుడ్ ఇక రావడం కష్టమే అనుకున్నారు. అయితే ఆర్సీబీ జట్టు కోసం తన మనసు మార్చుకున్నాడు.
ప్లే ఆఫ్స్ కు ముందు బెంగళూరు జట్టులో చేరిన ఈ ఆసీస్ పేసర్.. క్వాలిఫయర్ 1 లో మూడు వికెట్లు తీసి పంజాబ్ ను వణికించాడు. మంగళవారం (జూన్ 3) పంజాబ్ కింగ్స్ తో ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో హేజల్ వుడ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఆర్సీబీకి టైటిల్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడైనా తమ మొదటి ప్రాధాన్యతను దేశానికే ఇస్తారు. కానీ కంగారూల స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్ల తన విధేయతను చాటుకున్నాడు.
జూన్ 11 నుంచి సౌతాఫ్రికాతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్నప్పటికీ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. తాను ఐపీఎల్ అయిపోయేవరకు ఆడతానని భరోసా ఇచ్చి అన్న మాట నిలబెట్టుకుంటున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున బెస్ట్ బౌలర్ గా నిలిచిన ఈ ఆసీస్ పేసర్ ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టి అగ్ర స్థానంలో ఉన్నాడు.