- డిమాండ్లు పరిష్కరించాలె
- లేకపోతే ఈనెల 11 నుంచి డ్యూటీలు బహిష్కరిస్తం
- సర్కారుకు జూనియర్ డాక్టర్ల అల్టిమేటం
- గాంధీ మెడికల్ కాలేజీలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
పద్మారావు నగర్, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఈనెల 11 నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు తీరును నిరసిస్తూ శనివారం గాంధీ మెడికల్ కాలేజీ ఎదుట వారు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. తమకు హైజీనిక్, సెక్యూరిటీతో కూడిన వసతిగృహాలను కేటాయించాలని, ఎన్ఎంసీ నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాల్లో పనిచేసే పీజీ డాక్టర్లకు ఆహార సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ కరిష్ని, రాష్ట్ర జూనియర్ డాక్టర్ల జనరల్ సెక్రటరీ డాక్టర్ అఖిల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కౌశిక్ జోషి పాల్గొన్నారు.