
- భారీ వర్షాలతో ఎగువ నుంచి 99వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
- 10 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేస్తున్న ఆఫీసర్లు
గద్వాల, వెలుగు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. గంట గంటకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.
అయితే ప్రాజెక్టుకు వరద పెరుగుతుందనే ముందస్తు సమాచారంతో ఇరిగేషన్ ఆఫీసర్లు సాయంత్రం నుంచి గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకు మొత్తం పది గేట్లను ఎత్తి.. 83,616 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 317.980 మీటర్ల లెవల్లో నీరు ఉండగా.. 4.86 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద మొదలు కావడంతో నెట్టెంపాడు లిఫ్ట్కు 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు.
2007 తర్వాత ఇప్పుడే
18 ఏండ్ల తర్వాత జూరాలకు మే నెలలో వరద వచ్చింది. గతంలో 2007 మే నెలలో ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద రాగా.. 1.50 టీఎంసీల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. మరోవైపు నది తీర, జూరాల దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలను అలర్ట్ చే యాలని ఆయన సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.