సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్ట్ ఎక్కడా చెప్పలే
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలన్న హైకోర్టు సూచనను తాము స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జీల కమిటీకి తాము అంగీకరిస్తున్నామని చెప్పారు. మంగళవారం హైకోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి భేషజాలకు పోకుండా కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఎస్మాపై హైకోర్టు ఒప్పుకోలేదని తెలిపారు. సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.