ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్

ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్

ఐపీఎల్ 17లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఛేదు అనుభవం ఎదురైంది. మే 9వ తేదీ బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో సూపర్ జేయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది.  లక్నో విధించిన 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89 నాటౌట్), అభిషేక్ శర్మ (75 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. దీంతో సన్ రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా రికార్డు విజయం సాధించింది.

అయితే, ఆటలో గెలుపోటములు సహజం.. కానీ, విచక్షణ కోల్పోయిన లక్నో యజమాని సంజీవ్ గోయెంకా,  కెప్టెన్ కెఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ లో  ఓటమి అనంతరం రాహుల్ వద్దకు వచ్చిన సంజీవ్.. ఏం ఆటయ్యా అది.. బౌలర్లు, ఫీల్డర్లను సరిగా ఉపయోగించుకోకుండా చెత్త కెప్టెన్సీ చేస్తున్నావ్  అంటూ తిడుతున్నట్లు..  గ్రౌండ్ లోనే అతనిపై అసహనంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ ఎదో చెప్పేందుకు ప్రయత్నించినా సంజీవ్ వినిపించుకోకుండా రాహుల్ పై కోపడ్డాడు. సంజీవ్ మాట్లాడేటప్పుడు.. రాహుల్ చాలా అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో కనిపించింది. 

ఈ ఘటనపై రాహుల్ ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు.. లక్నో యజమాని తీరును తీవ్రంగా తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినంత మాత్రానా రాహుల్ తో ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం ఏంటంటూ సంజీవ్ గోయెంకాను సోషల్ మీడియా వేదికగా ఏకీ పారేస్తున్నారు. రాహుల్ ఎంతో టాలెంటెడ్ ఇండియన్ క్రికెటర్ అని, కెమెరా ముందే.. కార్పొరేట్ ఉద్యోగితో ప్రవర్థించినట్లు  అతనితో ఇలా రాష్ గా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లక్నోను వదిలేసి.. ఆర్సీబీకి వచ్చెయ్ అంటూ మరికొంతమంది రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.  ఈ వీడియోలో రాహుల్ ను చూస్తుంటే హార్ట్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు ఏం చేయాలో తెలియక చూస్తుండిపోయామని.. వారిద్దరూ అలవోకగా సిక్సులు కొడుతున్నారని అన్నారు. 240 పరుగులు కొట్టినా.. వారు ఛేజ్ చేసేవారని రాహుల్ అన్నాడు.

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పలు రికార్డులు నెలకొల్పింది.  10 ఓవర్లలోపే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్ల లోపే 167/0 పరుగులు చేసిన జట్టుగానూ హైదరాబాద్ నిలిచింది.లక్నోపై భారీ విజయంతో ఎస్ఆర్ హెచ్ పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది.