సరిగా పని చేయని ఉద్యోగినికి ట్రిప్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్టప్ ఓనర్.. అసలు కారణం ఇదే!

సరిగా పని చేయని ఉద్యోగినికి ట్రిప్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్టప్ ఓనర్.. అసలు కారణం ఇదే!

ఉద్యోగి సరిగా పని చేయకపోతే చాలా కంపెనీలు ముందుగా వార్నింగ్ ఇస్తాయి. పరిస్థితి మారకపోతే శాలరీ కట్, డిమోషన్, ఉద్యోగం నుంచి తొలగించడం సాధారణంగా కనిపించే చర్యలు. కానీ ముంబైకి చెందిన ఓ స్టార్టప్ యజమాని మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. తప్పులు చేస్తున్న ఉద్యోగినిని శిక్షించడానికి బదులుగా ఆమె కోసం 3 రోజుల ట్రిప్‌ను స్పాన్సర్ చేశాడు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా.. అతని కంపెనీకి కొత్త ఉద్యోగ దరఖాస్తుల వెల్లువను తెచ్చిపెట్టింది.

ముంబైకి చెందిన బ్లూ లాబ్‌స్టర్ మీడియా వ్యవస్థాపకుడు ధ్రువ్ ముఖర్జీ తన లింక్డ్‌ఇన్ పోస్టులో దీనిని పంచుకున్నారు. ఆయన కంపెనీలో కంటెంట్ ఆపరేషన్స్ లీడ్‌గా పనిచేస్తున్న ఆర్యా ఫడ్నిస్ కొంతకాలంగా పనిలో ఆలస్యం, క్వాలిటీ సమస్యలు, డెడ్‌లైన్‌లు మిస్ కావడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ఇది సాధారణ పనితీరు సమస్య అనుకున్న ధ్రువ్.. పలుమార్లు మాట్లాడి మెరుగుపడే అవకాశం ఇచ్చారు. కానీ పరిస్థితి మారకపోవడంతో "ఈ బాధ్యత నీకు సరిపోవడం లేదేమో" అని కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే తర్వాత ఆమెతో ప్రశాంతంగా మాట్లాడినప్పుడు అసలు కారణం తెలిసింది. వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యల వల్ల ఆమె మానసికంగా ఒత్తిడికి గురై పనిపై పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నట్లు తెలుసుకున్నాడు.

తన తప్పులకు బాధపడిన ఆర్యా.. తన జీతంలో కోత విధించాలని కూడా కంపెనీని కోరింది. కానీ ధ్రువ్ మాత్రం ఆమెను శిక్షించే బదులుగా పూర్తిగా భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. పూణేలో ఉండే ఆర్యా కోసం మూడు రోజుల Airbnb బసకు అయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరించింది. అందులో 2 రోజులు ప్రశాంత వాతావరణంలో పని చేయడానికి.. మరో రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అంతేకాదు ఇంటి దగ్గరలోని కో-వర్కింగ్ స్పేస్‌లో ఆమెకు ప్రత్యేక డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. రిమోట్‌గా పనిచేసే ఉద్యోగికి మంచి వాతావరణం కల్పిస్తే పనితీరు మెరుగుపడుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువ్ అన్నారు.

ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదన్నారు ధ్రువ్. రెండున్నరేళ్లుగా కంపెనీలో నిజాయితీగా పనిచేసిన ఆర్యాపై తనకు ఉన్న నమ్మకమే దీనికి కారణమని చెప్పారు. ప్రతి ఉద్యోగిని ఒకే విధంగా చూడలేమని, కానీ నిజంగా కష్టపడే వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరో అవకాశం ఇవ్వడం యజమాని బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను వివరించిన లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ కావడంతో వేలాది మంది నిర్ణయాన్ని ప్రశంసించారు. చాలా మంది ఉద్యోగం కోసం కంపెనీని సంప్రదించగా.. అందులో ఒకరిని ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నట్లు ధ్రువ్ వెల్లడించారు. ఆర్యా కూడా ఈ సంఘటన తనలో కంపెనీపై మరింత నమ్మకాన్ని పెంచిందని, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సంస్థ కోసం మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పం కలిగిందని చెప్పింది. ఉద్యోగులను కేవలం పనితీరు ఆధారంగా కాకుండా.. మనుషులుగా అర్థం చేసుకుంటే సంస్థకూ, ఉద్యోగికీ మంచి ఫలితాలు సాధ్యమవుతాయని ఇది నిరూపించింది.