బోటింగ్, అమ్యూజ్మెంట్ వాటర్ పార్కులు, గార్డెన్ల అభివృద్ధి
బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించిన సర్కార్
టూరిజానికి ఎన్నడూ లేనంతగా ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి మీద నిర్మించిన బ్యారేజీలను టూరిస్ట్ స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.250 కోట్లు కేటాయించింది. కాశ్మీర్లో దాల్ సరస్సులా ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ నిధులతో గోదావరి నదికి ఇరువైపులా దాల్ లేక్లా ఆకర్షణీయంగా మొక్కలు పెంచనున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీల వద్ద బోటింగ్, బృందావన్ గార్డెన్లోలా ఫౌంటెయిన్, అమ్యూజ్మెంట్ వాటర్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మేడిగడ్డ బ్యారేజీ టూరిస్ట్ స్పాట్కు రూ.105 కోట్లు, కన్నెపల్లికి రూ.80 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ.25 కోట్లు, అన్నారం కెనాల్ టు కన్నెపల్లి టూరిజం పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. ఈ ఫండ్స్తో అభివృద్ధి పనులు పూర్తయితే సాగునీటి ప్రాజెక్టులు కొత్త కళను సంతరించుకోనున్నాయి.