
వన్డే క్రికెట్ చరిత్రలో గుర్తుంచుకునే ఇన్నింగ్స్ లు కొన్నే ఉంటాయి. వాటిలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజం కపిల్ దేవ్ 175 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఒకటి. వన్డే క్రికెట్ లో ఇప్పటికే చాలా మంది డబుల్ సెంచరీలు కొట్టారు. మెరుపువేగంతో సెంచరీలు బాదారు. వాటన్నిటికీ రాని క్రెడిట్ కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్ కు వచ్చింది. సరిగ్గా 42 ఏళ్ల క్రితం ఇదే రోజున (జూన్ 18) విశ్వరూపం ప్రదర్శించాడు. 1983 ప్రపంచ కప్లో భాగంగా జూన్ 18న జరిగిన మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపాడు. తన వీరోచిత బ్యాటింగ్తో చెలరేగి ఆడి భారత జట్టుకు ఓటమిని తప్పించాడు.
వన్డే ఆల్ టైం బెస్ట్ ఇన్నింగ్స్:
1983 వరల్డ్ కప్.. టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్..17 పరుగులకే టీమిండియా 5 వికెట్లు.. క్రీజ్ లో లోయర్ ఆర్డర్ తో కెప్టెన్ కపిల్.. ఇది టీమిండియా పరిస్థితి. ఈ దశలో జట్టు స్కోర్ 100 పరుగులైనా దాటితే గొప్పే అనుకున్నారు. గెలుపు తర్వాత సంగతి ముందు పరువు నిలుపుకుంటే చాలనుకున్నారు భారత అభిమానులు. అయితే కపిల్ దేవ్ మాత్రం అద్భుతం చేశాడు.138 బంతుల్లోనే 175 పరుగులతో అజేయంగా నిలిచి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చాటిచెప్పాడు. ఏకంగా భారత్ స్కోరును 266కు చేర్చాడు. క్రికెట్ చరిత్రలో ఇది ఒకానొక గొప్ప ఇన్నింగ్స్గా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలోనే భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత ఓపెనర్లు సునీల్ గవాస్కర్ (0), కృష్ణమాచారి శ్రీకాంత్ (0) డకౌట్ అయ్యారు. పరుగుల ఖాతా తెరవకుండా ఔట్ కావడంతో కపిల్ సేన ఒత్తిడిలో పడింది. ఆ వెంటనే మొహిందర్ అమర్నాథ్ (5), సందీప్ పాటిల్ (1), యశ్పాల్ శర్మ (9) కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
జట్టు వరుసగా వికెట్లు కోల్పోయిన కపిల్ వెనకడుగు వేయలేదు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ఆరో స్థానంలో వచ్చిన కపిల్ దేవ్.. జింబాబ్వే బౌలర్లపై విరుచుపడ్డాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ బౌండరీలతో చెలరేగాడు. మరో ఎండ్లో రోజర్ బిన్నీ (22).. కపిల్కు సహకరించడంతో స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. కపిల్ చివరి వరకు బాదుడు కొనసాగించాడు. బిన్నీ తర్వాత మదన్లాల్ (17), సయ్యద్ కిర్మాణీ (24 నాటౌట్) తో కలిసి భారత జట్టుకు భారీ స్కోర్ అందించి రేస్ లో నిలిపాడు.
ఓవరాల్ గా 138 బంతుల్లోనే 175 పరుగులతో చివరి వరకు నాటౌట్గా నిలిచాడు కపిల్ దేవ్. ఈ ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. కపిల్ దేవ్ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియా 8 వికెట్లుకు 266 పరుగుల స్కోరు చేయగలిగింది. నిప్పులు చెరిగే బౌలర్గా అప్పటి వరకు పాపులర్ అయిన కపిల్ దేవ్.. తాను భీకర బ్యాటర్ అని కూడా ఈ ఇన్నింగ్స్తో ప్రపంచానికి చాటిచెప్పాడు. క్రికెట్ హిస్టరీలో ఒకానొక గ్రేట్ సెంచరీగా ఇది నిలిచింది.
అనంతరం జింబాబ్వేను 235 పరుగులకు భారత్ కుప్పకూల్చింది. 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి 1983లో ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి.. తొలిసారి ప్రపంచకప్ను సాధించింది భారత్. ఆ తర్వాతే ఇండియాలో క్రికెట్ దశదిశ మారింది.