బాబ్రీ మసీదుపై ఈ నెలలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంలో వెలువడనున్న తీర్పుపై కరీంనగర్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించిందని చెప్పారు. తీర్పు ఏదైనా అందరూ కట్టుబడి ఉండి.. నగరంలో ప్రశాంతవరణానికి సహకరించాలని కమిటీని కోరామన్నారు. తీర్పు తర్వాత ఏ మతస్థులైనా ర్యాలీలు, సంబరాలు, నిరసనలు చేపట్టడానికి అనుమతి లేదని తెలిపారు. సోషల్ మీడియాలో సుప్రీం తీర్పునకు అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్టీసీ సమ్మె విషయంపై మాట్లాడుతూ.. ప్రభుత్వ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఆర్టీసీ డిపోలు, కలెక్టరేట్, తహశీల్దార్, ఆర్టీవో కార్యాలయాల్లో తమ అనుమతిని తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరవచ్చని తెలిపారు.