రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కిడ్నాప్కు గురైన కరుణాకర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 16వ తేదీన కారులో వెళ్తున్న కరుణాకర్ రెడ్డిని చేగూర్ దగ్గర కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం కరుణాకర్ రెడ్డిని చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టిన కిడ్నాపర్లు..ప్రమాదం జరిగిందని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కరుణాకర్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కరుణాకర్ రెడ్డిని ఐదు మంది ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కరుణా కర్ రెడ్డి.. తన సమీప బంధువు శ్రీధర్ రెడ్డితో కలిసి పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో కొత్తూరు మండలం తీగాపూర్ శివారులో కురుణాకర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారులో వచ్చిన నలుగురు దుండగులు అడ్డగించారు. కారు అద్దాలు ధ్వసం చేసి శ్రీధర్ రెడ్డిపై దాడి చేశారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డిని బలవంతంగా మరో కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. గాయాల పాలైన శ్రీధర్ రెడ్డి.. కరుణాకర్ రెడ్డి కుటంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో కరుణాకర్ రెడ్డ కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రజాప్రతినిధి పాతకక్షలతో తన కుమారుడిని కిడ్నాప్ చేశాడని కరుణాకర్ రెడ్డి తల్లి స్వరూప ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుప్రతి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్నపోలీసులు..మృతుడు కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్ రెడ్డి మరణ వార్త వినగానే ఆయన కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఏప్రిల్16వ తేదీన కిడ్నాప్ గురయ్యాడని ఫిర్యాదు చేశామని.. అయితే కరుణాకర్ రెడ్డి చనిపోయాడని పోలీసులు ఫోన్ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షలు నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు హత్య చేశారని కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.