ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసిందని కమిటీ మెంబర్ మోతే శోభన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు.
గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు జిల్లాల వారీగా పర్యటించి ఉద్యమకారుల అభిప్రాయాలు సేకరించి, ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర నివేదిక అందజేస్తామని తెలిపారు. సమావేశం సందర్భంగా కొందరు ఉద్యమకారులు ‘ఉద్యమకారుల ద్రోహి కేసీఆర్’ అంటూ నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
