హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని ఆయన నిర్ణయించారు. మంగళవారం (మే 12) ఎర్రవెల్లి ఫామ్హౌస్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ మండలానికి, మున్సిపల్ బాడీల వారిగా సభ్యత్వ సమన్వయ కమిటీలను రెండు మూడు రోజుల్లో నియమించాలని నిర్ణయించారు. డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో, బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణాతరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్దతిలో చేపట్టేందుకు తగిన శిక్షణా శిభిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించబడిన ఇంచార్జీలు:
- ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు-తక్కళ్లపల్లి రవీందర్ రావు
- జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి
- ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్
- జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి
- మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు – గ్యాదరి బాలమల్లు
- నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్
- మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి
- వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి
- మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ
- గద్వాల్,నాగర్కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్
- మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
- హైదరాబాద్ జిల్లా — తలసాని శ్రీనివాస్ యాదవ్
- నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
