చేవెళ్ల గడ్డపై కాషాయం జెండాఎగరేద్దాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

చేవెళ్ల గడ్డపై కాషాయం జెండాఎగరేద్దాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

పరిగి వెలుగు : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే తన గెలుపు ఖాయమైందని పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తూ చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై కాషాయం జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ లోని దోమ మండలం మోత్కుర్, పూడూరు, కులకచర్ల, చౌడపూర్ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు దోమలో ప్రతి గ్రామం ఐదారు సార్లు తిరిగినా, ఇప్పుడు ఉన్న ఎంపీ కనీసం ఒక్కసారైనా వచ్చిండా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పై కోపంతో వేశారే కానీ.. ప్రేమతో కాదన్నారు. ప్రస్తుతం బీజేపీకి మంచి అనుకూల వాతావరణం ఉందని భారీ మెజార్టీతో గెలుస్తానన్నారు.

ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారుతి కిరణ్ గౌడ్, మండల అధ్యక్షుడు అనంతయ్య, రాష్ర్ట కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, అసెంబ్లీ ప్రభారి పోరెడ్డి నరసింహా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, అయినపురం యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు వివేక్ రెడ్డి, యువ నేత మిట్ట పరమేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సింహ, రాజు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.