నిధుల్లేక రెగ్యులర్​ పనులకే పరిమితమైన పల్లె, పట్టణ ప్రగతి

నిధుల్లేక రెగ్యులర్​ పనులకే పరిమితమైన పల్లె, పట్టణ ప్రగతి
  • అప్పులు తెచ్చి పెట్టలేమని చేతులెత్తేసిన సర్పంచులు, కౌన్సిలర్లు
  • పైసా ఖర్చు లేని పనులే చేస్తమని బాహాటంగా చెప్తున్న ఆఫీసర్లు
  • ప్రజలు చెప్పే సమస్యలు రాసుకపోతున్నరు

వెలుగు, నెట్​వర్క్: ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్​ రాకపోవడంతో పల్లె, పట్టణ ప్రగతిలో రోడ్లు ఊడ్చుడు, చెత్త ఎత్తుడు, మోర్లు తీసుడు లాంటి రెగ్యులర్​ పనులకే పరిమితమవుతున్నారు. గతంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే ఆ బిల్లులే సర్కారు ఇవ్వలేదని, కొత్తగా తాము తెచ్చి పెట్టలేమని సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేతులెత్తేశారు. దీంతో పైసా అవసరం లేని పనులైతేనే తాము చేస్తామని, లక్షలు ఖర్చయ్యే పనులు తమకు చెప్పవద్దని ఆఫీసర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. కేవలం ప్రజలు చెప్పే సమస్యలను రాసుకొని ‘చూస్తం.. చేస్తం’ అంటూ వెళ్లిపోతున్నారు. కొత్తగా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కరెంట్​పోళ్లు, లైన్లు వేయడం, కనెక్షన్లు ఇయ్యడం లాంటి పనులు చేయకపోవడాన్ని పబ్లిక్ తప్పుపడుతున్నారు. రోజూ లాగేరోడ్లు ఊడ్వడం, మోర్లు తీయడం లాంటి పనులకు ఇంత హడావిడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

చూస్తం.. చేస్తం.. అంటూ దాటవేత..
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గతేడాది విలేజ్​పార్కులు, శ్మశానవాటికలు, సెగ్రిగేషన్​ షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. సర్కారు నుంచి ఎలాంటి ఫండ్స్​ రాకున్నా సర్పంచులు, కౌన్సిలర్లు బయట లక్షల్లో అప్పు తెచ్చి మరీ పనులు చేశారు. కానీ సర్కారు నుంచి పెండింగ్​ బిల్లులు రాకపోవడంతో ఈసారి చేతులెత్తేశారు. పాత అప్పులు కట్టకపోవడం వల్ల తమకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ స్థానిక ప్రజాప్రతినిధులు పక్కకు తప్పుకున్నారు. ఇక పనులపై పబ్లిక్​, ఫండ్స్​పై సర్పంచులు నిలదీస్తుండడంతో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా వస్తున్నా గతేడాది మొదలుపెట్టి, ఇటీవల పూర్తయిన నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతున్నారు. కానీ తప్పని సరి పరిస్థితుల్లో కార్యక్రమాలకు హాజరవుతున్న ఆఫీసర్లకు ప్రజలు వివిధ సమస్యలపై మొరపెట్టుకుంటున్నారు. తమ ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని, వీఓ బిల్డింగులు, అంగన్​వాడీ భవనాలు, వాటికి ప్రహరీలు నిర్మించాలని, మిషన్​ భగీరథ  కనెక్షన్లు ఇవ్వాలని, రోడ్లపై మిషన్​భగీరథ గుంతలు పూడ్చాలని, కొత్త కరెంట్​పోళ్లు, లైన్లు వేయాలని, కనెక్షన్లు ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఆయా పనులు చేసేందుకు సర్పంచులు, కౌన్సిలర్లతో పాటు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాకపోవడంతో ఆఫీసర్లు  ప్రజలు ఇచ్చే అర్జీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. సర్కారు నుంచి ఫండ్స్​ రానందున ప్రస్తుతానికి ఖర్చు లేని పనులు మాత్రమే చేస్తామంటున్నారు. ఈసారి ఈజీఎస్​ ఫండ్స్​తో క్రీడాప్రాంగణాలు ఏర్పాటుచేయాలని భావించినా జాగలు దొరక్క, దొరికినా ఇప్పటికిప్పుడు ఏమీ చేయ​లేక పాత స్టేడియాలు, స్కూల్ ​గ్రౌండ్లకు బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. 

కరెంటోళ్లు కూడా దూరం.. దూరం
పల్లె ప్రగతి కార్యక్రమాలకు చాలాచోట్ల ట్రాన్స్​కో ఆఫీసర్లు కూడా హాజరైతలేరు.  రెండు, మూడో విడతల్లో చేపట్టిన  పనులకు సంబంధించిన పాత బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియర్​ చేసేదాకా కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. దీంతో కరెంటోళ్లు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చాలా చోట్ల  అవాయిడ్ చేస్తున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, కోహీర్, మొగుడంపల్లి, సదాశివపేట, కల్హేర్, మునిపల్లి, మనూర్, కంగ్టి మండలాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే పేరుతో  విద్యుత్ అధికారులు చేతులెత్తేశారు. ఇలా అన్ని చోట్లా కేవలం కరెంట్​తీగలు సరిచేయడం, చెట్ల కొమ్మలు కొట్టేయడం లాంటి పనులకే ట్రాన్స్​కో సిబ్బంది పరిమితమవుతున్నారు.    

రాస్కపోవుడే తప్ప చేసేదేం లేదు.. 
పల్లె ప్రగతిలో కేవలం మురుగు కాల్వలు, రోడ్లు  సాఫ్ చేయిస్తున్నం. అభివృద్ధి పనులు చేద్దామంటే పైసల్లేవు. గతేడాది చేసిన పనులకు బిల్లులే ఇప్పటిదాకా రాలే.  ఇప్పుడు చేస్తే వస్తయన్న గ్యారెంటీ లేదు. కానీ సర్కారు ఆఫీసర్ల మీద ఒత్తిడి తెస్తే వాళ్లు మాపై ఒత్తిడి చేస్తున్నరు. గ్రామాల్లో పాత కరెంట్ స్తంభాలు, తీగలు తొలగించి కొత్తవి పెట్టాలనే విజ్ఞప్తులు వచ్చినా రాసుకపోవుడే తప్ప పట్టించుకుంటలేరు.
-పాండు గౌడ్ . సర్పంచ్, తర్నికల్, కల్వకుర్తి మండలం, నాగర్​కర్నూల్​ జిల్లా

పైసలిస్తేనే చేస్తరంట​.. 
మా గ్రామంలోని పలు కాలనీల్లో కరెంట్​ సమస్యలు ఎక్కువగా ఉన్నయి. పల్లె ప్రగతిలో భాగంగా కొత్త స్తంభాలు, కొత్త లైన్లు వేయాలని అడిగినం. కానీ గ్రామపంచాయతీ నుంచి ముందస్తు డబ్బులు చెల్లిస్తేనే  కొత్త స్తంభాలు, లైన్లు వేస్తామని ట్రాన్స్​కో ఆఫీసర్లు చెప్తున్నరు. మాది చిన్న గ్రామ పంచాయతీ. వచ్చే నిధులు కరెంటు బిల్లులు, ట్రాక్టర్ మెయింటనెన్స్ కే సాల్తలేవు. కరెంట్ పనుల కోసం ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టాలె. ఇలా ఫండ్స్​ ఇయ్యకుండా పల్లె ప్రగతి పెట్టడం వల్ల ఎలాంటి లాభం ఉండది.
 -ఆకుల రాజు రెడ్డి , విట్టంపేట  సర్పంచ్, మెట్ పల్లి మండలం, జగిత్యాల జిల్లా