
- వామపక్ష పార్టీల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: చత్తీస్ గఢ్ లో మావోయిస్టు నేతలను కాల్చిచంపి ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. హైదరాబాద్లోని ముగ్దూం భవన్లో వామపక్ష పార్టీల నేతలు శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజాపూర్ పోలీస్ కస్టడీలోని నాయకులను ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేస్తున్నారని, 2004నాటి శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్, సురేశ్ తో పాటు ఐదుగురి మృతి అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.10 నుంచి 20 మంది నాయకులు ఇంకా పోలీసుల కస్టడీలో ఉన్నారని, వారిని కూడా ఇదే రీతిలో కాల్చిచంపి ఎన్కౌంటర్ గా చిత్రీకరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరారు.