కోయంబత్తూర్‌లో చిరుత కలకలం.. నాలుగేళ్ళ చిన్నారిని ఎత్తుకెళ్ళి చంపేసింది..

కోయంబత్తూర్‌లో చిరుత కలకలం.. నాలుగేళ్ళ చిన్నారిని ఎత్తుకెళ్ళి చంపేసింది..

తమిళనాడులోని కోయంబత్తూర్ లో చిరుత సంచారం కలకలం రేపింది.. చిరుత దాడిలో నాలుగేళ్ళ చిన్నారి మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూర్ లోని వాల్ పారై అటవీ గ్రామాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. రోషిణి అనే చిన్నారిని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్ళి చంపేసింది చిరుత. సమీపంలోని టీ ఎస్టేట్ లో కూలీలపై దాడి చేయగా.. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వాల్ పారై గ్రామంలో విధ్వంసం సృష్టించి అదృశ్యమయ్యింది చిరుత.

ALSO READ | హైదరాబాద్ లో రూ. 15 లక్షల హర్యానా మద్యం సీజ్.. ఇద్దరు అరెస్ట్..

చిన్నారి రోషిణి మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అర్దాంతరంగా చిరుత దాడిలో మరణించడంతో రోషిణి తల్లి కన్నీరు మున్నీరయ్యింది. రోషిణి తల్లి విలపించిన తీరు చూసి గ్రామస్థులు సైతం చలించిపోయారు.

చిరుత సంచారంతో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు డ్రోన్ కెమెరాలతో చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు గ్రామస్థులు. వీలైనంత త్వరగా చిరుతను గుర్తించి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు.