- 35 శాతం మంది టికెట్లు కేటాయించని బీజేపీ
- పనిచేయలేదని కొందరికి, పొత్తుల వల్ల మరికొందరికి
2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కూడా ఆ సీట్లన్నింటిని పదిలంగా ఉంచుకొని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచించింది. మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేసింది. పొత్తులు, సీట్ల కేటాయింపు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. గతంలో ఎక్కువ సీట్లు సాధించిన యూపీ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితిలో మార్పు రావటంతో ఆయా రాష్ట్రాల్లోని సీట్లపై బాగా దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగానే లోక్సభకు ఫస్ట్ టైం ఎన్నికైన ఎంపీల్లో (మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారు) చాలా మందికి ఈసారి సీట్లు కేటాయించలేదు.
గత ఎన్నికల్లో గెలిచిన 158 మంది ఫస్ట్టైం ఎంపీల్లో ఈ సారి దాదాపు 55 (35 శాతం) మందికి టికెట్లు ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. నియోజకవర్గాల్లో పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం, పొత్తుల్లో భాగంగా ఆ సీట్లు మిత్రపక్షాలకు వెళ్లడమే దానికి కారణమని తెలుస్తోంది. ఎక్కువ మందికి మాత్రం పనిచేయలేదనే కారణంతోనే సీట్లను ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. రెండోసారి సీట్లు దక్కని క్యాండిడేట్లలో ఎక్కువ మంది యూపీకి చెందిన వారే ఉన్నారు. చత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్సింగ్ కొడుకు అభిషేక్ సింగ్కు కూడా రెండోసారి సీటు ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదంటే
“2014లో పోటీ చేసిన వాళ్లు కొత్తోళ్లైనా.. మోడీ ప్రభావంతో గెలిచారు. కానీ వాళ్ల పనితీరుతో హైకమాండ్ సంతృప్తికరంగా లేదు. కొంత మందికైతే కనీసం వారి నియోజకవర్గాల గురించి కూడా ఏమీ తెలీదు. ప్రజా వ్యతిరేకత ఉన్నందున ఫస్ట్ టైం ఎంపీలు, కొంత మంది సిట్టింగ్ ఎంపీలకు కూడా పార్టీ ఈసారి సీట్లు ఇవ్వలేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అందరికీ అదే రీజన్తో సీట్లు రిజక్ట్ చేయలేదని, కొంత మందికి పొత్తుల్లో భాగంగా సీట్లు కేటాయించలేక పోయామని అన్నారు. కొందరికి సీట్లలో మార్పు చేశామని చెప్పారు.
కాంగ్రెస్లో ఇద్దరే
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మొత్తం 11 మంది కొత్తవారు లోక్సభకు ఎన్నిక కాగా.. వారిలో ఈ సారి ఇద్దరికి మాత్రమే టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా కర్నాటకలోని తుమకూరు సీటు జేడీఎస్కు రావటంతో 2014లో ఆ సీటులో గెలుపొందిన ముద్దానుమ గౌడకు సీటు ఇవ్వలేదు. మహారాష్ట్రలోని హింగోలి నుంచి గెలిచిన రాజీవ్ సాతవ్ గుజరాత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకోవటంతో పోటీకి దూరంగా ఉన్నారు.

