ప్రభుత్వ ఉద్యోగులు ధరించే బట్టల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు బట్టలు వేసుకునే విధానానికి సంబంధించి పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం హుందాతనం కాదని ప్రభుత్వ ఉత్తర్వులలో తెలిపింది. గ్వాలియర్ డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యేటప్పుడు జీన్స్, టీ షర్టులు ధరించడంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్ కమిషనర్ ఎంబీ ఓజా సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.
జూలై 20న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్సౌర్ ఇల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి హాజరయ్యారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.