
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయాలనే వివాదాస్పద భాషా విధాన తీర్మానాలను వెనక్కి తీసుకున్నది. హిందీని బలవంతంగా రుద్దడానికి సర్కారు ప్రయత్నిస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన రెండు ప్రభుత్వ తీర్మానాలను మహారాష్ట్ర కేబినెట్ ఆదివారం ఉపసంహరించుకుంది. ఏప్రిల్16న జారీ చేసిన మొదటి తీర్మానం ప్రకారం..1 నుండి 5 తరగతుల విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేర్చారు. అయితే, జూన్ 17న దీనిని సవరించి హిందీని ఐచ్ఛికం చేశారు. ఇప్పుడు ఈ రెండు తీర్మానాలను కేబినెట్ విత్ డ్రా చేసుకున్నది.
కాగా, త్రిభాషా విధానం మరాఠీ భాష, సంస్కృతి ప్రాముఖ్యతను దెబ్బ తీస్తుందని ప్రతిపక్ష పార్టీలు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన వంటి పార్టీలు హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి. కాగా, భవిష్యత్తులో భాషా విద్యా విధానంపై సిఫార్సులు చేసేందుకు డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కొత్త నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. గతంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హయాంలో డాక్టర్ రఘునాథ్ మాషెల్కర్ కమిటీ సిఫార్సులను అంగీకరించారని.. ఆ నిర్ణయమే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడానికి దారితీసిందని చెప్పారు. తాజాగా తీర్మానాలను కేబినెట్ విత్ డ్రా చేసుకోవడంతో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా జులై 5న తలపెట్టిన నిరసన ప్రదర్శనలు రద్దయ్యాయి.