పుణె: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్లు తదితర వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేయడం సాధారణమే! అయితే, మహారాష్ట్రలో ఓ వ్యాపారి మామిడి పండ్లను కూడా ఈఎంఐ కింద అమ్ముతున్నాడు. పుణెకు చెందిన గౌరవ్ సనాస్ అనే వ్యాపారి గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రాడక్ట్స్ పేరుతో బిజినెస్ చేస్తున్నాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మామిడి పండ్ల సీజన్ మొదలైంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి పండ్లు వస్తున్నాయి. సీజన్ స్టార్టింగ్ కావడంతో పండ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని కొంకణ్ రీజియన్లో దేవ్గఢ్, రత్నగిరి ప్రాంతాల్లో ఎక్కువగా పండే అల్ఫాన్సో రకం మామిడి పండ్ల రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి.
ఈ పండ్ల ధర డజన్కు రూ.800 నుంచి రూ.1,300 పలుకుతున్నాయి. ఇంత కాస్ట్ పెట్టి జనాలు ఈ పండ్లను తినలేరని గౌరవ్ భావించాడు. దీంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఈఎంఐలలో అమ్ముతున్నట్లు.. మామిడి పండ్లను ఎందుకు ఇన్స్టాల్మెంట్లో విక్రయించకూడదు అనుకున్నాడు. ఆ వెంటనే ఎక్కువ ధర పెట్టి మామిడి పండ్లు కొనలేని వారికి ఈఎంఐ ద్వారా పండ్లు కొనే వెసులుబాటు కల్పించాడు. అయితే, క్రెడిట్ కార్డు ద్వారా కొనే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాడు. అది కూడా రూ.5 వేల విలువ చేసే మామిడి పండ్లు కొంటేనే ఈఎంఐ అప్షన్ వర్తిస్తుందని చెప్పాడు. కొన్న పండ్లను మూడు, ఆరు, 12 నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చని వెల్లడించాడు. ఇప్పటివరకు ఈ ఆప్షన్ను నలుగురు ఉపయోగించుకున్నారని గౌరవ్ తెలిపాడు.