వివాహితతో కలిసి పురుగుల మందు తాగిన యువకుడు

వివాహితతో కలిసి పురుగుల మందు తాగిన యువకుడు

పురుగుల మందు సేవించి ఓ యువకుడు, ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ బోరబండకు చెందిన  మహిళ (32), వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చిన్న ఫాస్లాబాద్ కు చెందిన వెంకట్(22)తో కలిసి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గేటు సమీపంలోని నీలగిరి తోటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.తమతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు సేవించారు. వెంకటేశ్ తన అన్నకు ఫోన్ చేసి  కండ్లపల్లి గేటు వద్ద బైక్ ఉందని తీసుకెళ్లమని ఫోన్లో సమాధానం చెప్పాడు. దీంతో వెంకటేశ్ అన్న గోపాల్ వెంటనే కండ్లపల్లికి చేరుకొని రోడ్డు పక్కన బైకుని గమనించాడు.

ఫారెస్ట్ లోపలికి వెళ్లి చూడగా తన తమ్ముడు వెంకటేశ్, మరో మహిళ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి పురుగులమందు సేవించిన ఇద్దరిని వికారాబాద్ లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వీరు బోరబండలో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు.మహిళ కు ముందుగానే పెళ్ళైందని.... ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. మహిళకు, యువకుడికి  మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహిళ వికారాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.