
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ముంబైలో జరిగిన పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశంలో అతిథులకు వెండి ప్లేట్లలో భోజనం అందించారు. ఒక్కో భోజనం ఖర్చు రూ. 5వేల వరకు ఉందని, ప్లేట్ అద్దెకే రూ.550 ఖర్చయిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ఇంత భారీ ఖర్చుతో విందును ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం రుణ సంక్షోభంలో ఉందని, రైతుల రుణమాఫీలు చేయడం లేదు.. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని అంటున్నారు.
మహారాష్ట్రలో పన్ను చెల్లింపుదారుల డబ్బును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. 600 మంది అతిథులకు మొత్తం రూ. 27 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు,సామాజిక కార్యకర్తలు. రాష్ట్రం దివాలా తీస్తోంది. ఈ సమయంలో అంచనాల కమిటీల సభ్యులకు వెండి ప్లేట్లలో భోజనం వడ్డించాల్సిన అవసరం ఏమిటి" అని మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వాడేట్టివార్ అన్నారు.
ప్రతి అతిథి భోజనానికి దాదాపు రూ. 5వేలు ఖర్చు చేశారు. రైతులకు మాత్రం రుణమాఫీ నిరాకరించారు.. బోనస్లు చెల్లించడం లేదు.. అనేక సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కోతలు పెట్టారని వాడెట్టివార్ ఆరోపించారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
పార్లమెంట్,రాష్ట్రాల అంచనాల కమిటీల రెండు రోజుల సమావేశం జూన్ 23న ముంబైలో జరిగింది. దక్షిణ ముంబైలోని విధాన భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్లమెంట్, రాష్ట్రాలు ,కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ప్యానెల్ల అధ్యక్షులు ,సభ్యులు హాజరయ్యారు. అంచనాల కమిటీ కేంద్ర ,రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పరిపాలనా విభాగం బడ్జెట్ అంచనాలు ,వ్యయాలను సమీక్షించింది.
ఈ కార్యక్రమానికి 600 మంది అతిథులకు రూ. 27 లక్షలు ఖర్చయిందని సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ఆరోపించారు. ప్రజా ధనాన్ని విపరీతంగా ఖర్చు చేశారు. ముంబై విధాన్ భవన్ భారతదేశం అంతటా ఉన్న బడ్జెట్ కమిటీ సభ్యులకు విలాసవంతమైన విందు ఇచ్చింది. దీని ధర ఒక్కొక్కరికి రూ. 4,500. వెండి ప్లేట్లలో (ఒక్కొక్కరికి రూ. 550) వడ్డించారు.600 మంది అతిథులకు భోజనం మొత్తం రూ. 27 లక్షలు ఖర్చు చేశారు. ఇది ప్రజల ఆగ్రహానికి దారితీసింది అని విజయ్ కుంభార్ Xలో పోస్ట్లో రాశారు.
40 అడుగుల బ్యానర్లు, తాజ్ ప్యాలెస్ ,ట్రైడెంట్ దగ్గర బసలు, AC డైనింగ్ టెంట్లు, షాన్డిలియర్లు ,ఎర్ర తివాచీలు ఇలా దుబారా ఖర్చు చేశారు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేయడమే అంటున్నాయి ప్రతిపక్షాలు.