రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అభివృద్ధి శూన్యం : ఎంపీ రఘునందన్ రావు

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అభివృద్ధి శూన్యం : ఎంపీ రఘునందన్ రావు

నాగర్ కర్నూల్ టౌన్ వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు పేర్కొన్నారు. మంగళవారం నాగర్​కర్నూల్​లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు అధికారం అప్పగిస్తే.. అల్లుడు, కొడుకు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. మిగిలిన నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారన్నారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వేల కోట్ల నిధులను మంజూరు చేస్తోందని విమర్శించారు. పాలకులు, పార్టీలు మారినా సాధారణ ప్రజల ఆర్థిక పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్​ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని, గతంలో ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తే, ప్రస్తుతం దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాలని, అన్ని ప్రాంతాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్  చేశారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏండ్లు పూర్తయినా సందర్భంగా, మోదీ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. బీసీ జాతీయ కమిషన్  మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్  ఆచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ పోతుగంటి రాములు పాల్గొన్నారు.