బాలిక మెడికల్​ రిపోర్ట్​లో కీలక వివరాలు

బాలిక మెడికల్​ రిపోర్ట్​లో కీలక వివరాలు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్​లో బాలికపై అత్యాచారం కేసులో కీలక వివరాలు బయటపడుతున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాధితురాలికి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆ మెడికల్​ రిపోర్ట్​ ఆధారంగా ఆమె ఒంటిపై మొత్తం 12 తీవ్రమైన గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక దాడి సమయంలో బాలికను నిందితులు గాయపరిచినట్టు డాక్టర్లు మెడికల్​ రిపోర్టులో పేర్కొన్నారు. బాలిక మెడపై గాట్లు, ప్రైవేట్​ పార్ట్స్​పై గాయాలున్నట్టు తేల్చారు. మెడ, చేతులు, కాళ్లు సహా ఇతర భాగాల్లో పంటి గాట్లు, గోళ్లతో దాడికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 

పబ్​కు ఇన్నోవా తెచ్చిన డ్రైవర్​ గురించి ఆరా  
సాదుద్దీన్​ను రెండో రోజు కస్టడీలో శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా విచారించారు. ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకుతో పాటు మైనర్లు సహా ఎంత మంది ఉన్నారనే వివరాలు రాబట్టారు. ఇన్నోవా కారును పబ్​ వద్దకు తీసుకువచ్చిన డ్రైవర్​‌‌‌‌ గురించి ఆరా తీశారు. సాదుద్దీన్​ సహా ఐదుగురు మైనర్లకు పబ్​ టికెట్లు ఎవరు బుక్​ చేశారని ప్రశ్నించారు. ఆరుగురు బెంజ్​ కారులోనే పబ్​కు వచ్చారా? లేదా మరేదైనా వెహికల్​ వాడారా? అనే వివరాలను సేకరించారు.  

సరైన సౌలతుల్లేక..
సైదాబాద్​ జువనైల్​ హోంలో ఉన్న ముగ్గురు మైనర్లను జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని విచారించేందుకు శుక్రవారం ఏసీపీ నర్సింగరావుతో కూడిన టీమ్​ జువనైల్​ హోంకు వెళ్లింది. జువనైల్​ హోమ్​ డైరెక్టర్​‌‌‌‌ను కలిసి మైనర్ల కస్టడీ గురించి వివరించారు. అయితే కస్టడీ ఆర్డర్​లో వారిని ఎక్కడ విచారించాలనే వివరాలు లేనట్టు సమాచారం. దాంతో పాటు హోంలో సరైన సౌలతులు లేకపోవడం, అక్కడ విచారిస్తే ఇతర మైనర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. పోలీస్​ స్టేషన్​లో విచారించేందుకు మరోసారి జువనైల్​ జస్టిస్​ బోర్డు ఆర్డర్​ తీసుకున్నారు. శనివారం ఆ మైనర్లను పోలీస్​ స్టేషన్​కు తరలించి విచారిస్తామని ఓ అధికారి చెప్పారు. కాగా మరో ఇద్దరు మైనర్లను కూడా పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు జువనైల్​ జస్టిస్​ బోర్డ్​ అనుమతిచ్చింది.