హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో బాలికపై అత్యాచారం కేసులో కీలక వివరాలు బయటపడుతున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాధితురాలికి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఆమె ఒంటిపై మొత్తం 12 తీవ్రమైన గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక దాడి సమయంలో బాలికను నిందితులు గాయపరిచినట్టు డాక్టర్లు మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు. బాలిక మెడపై గాట్లు, ప్రైవేట్ పార్ట్స్పై గాయాలున్నట్టు తేల్చారు. మెడ, చేతులు, కాళ్లు సహా ఇతర భాగాల్లో పంటి గాట్లు, గోళ్లతో దాడికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
పబ్కు ఇన్నోవా తెచ్చిన డ్రైవర్ గురించి ఆరా
సాదుద్దీన్ను రెండో రోజు కస్టడీలో శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా విచారించారు. ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకుతో పాటు మైనర్లు సహా ఎంత మంది ఉన్నారనే వివరాలు రాబట్టారు. ఇన్నోవా కారును పబ్ వద్దకు తీసుకువచ్చిన డ్రైవర్ గురించి ఆరా తీశారు. సాదుద్దీన్ సహా ఐదుగురు మైనర్లకు పబ్ టికెట్లు ఎవరు బుక్ చేశారని ప్రశ్నించారు. ఆరుగురు బెంజ్ కారులోనే పబ్కు వచ్చారా? లేదా మరేదైనా వెహికల్ వాడారా? అనే వివరాలను సేకరించారు.
సరైన సౌలతుల్లేక..
సైదాబాద్ జువనైల్ హోంలో ఉన్న ముగ్గురు మైనర్లను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని విచారించేందుకు శుక్రవారం ఏసీపీ నర్సింగరావుతో కూడిన టీమ్ జువనైల్ హోంకు వెళ్లింది. జువనైల్ హోమ్ డైరెక్టర్ను కలిసి మైనర్ల కస్టడీ గురించి వివరించారు. అయితే కస్టడీ ఆర్డర్లో వారిని ఎక్కడ విచారించాలనే వివరాలు లేనట్టు సమాచారం. దాంతో పాటు హోంలో సరైన సౌలతులు లేకపోవడం, అక్కడ విచారిస్తే ఇతర మైనర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. పోలీస్ స్టేషన్లో విచారించేందుకు మరోసారి జువనైల్ జస్టిస్ బోర్డు ఆర్డర్ తీసుకున్నారు. శనివారం ఆ మైనర్లను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తామని ఓ అధికారి చెప్పారు. కాగా మరో ఇద్దరు మైనర్లను కూడా పోలీసుల కస్టడీకి ఇచ్చేందుకు జువనైల్ జస్టిస్ బోర్డ్ అనుమతిచ్చింది.