Bangladesh Cricket: మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లు.. బంగ్లాదేశ్ వన్డే జట్టుకు కొత్త సారధి

Bangladesh Cricket: మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లు.. బంగ్లాదేశ్ వన్డే జట్టుకు కొత్త సారధి

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వన్డేలకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మీరాజ్ ను గురువారం (జూన్ 12) బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా ఒక సంవత్సరం పాటు నియమిస్తున్నట్టు ధ్రువీకరించింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో మెహిదీ హసన్ వన్డేలకు కెప్టెన్సీ చేయనున్నాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో స్థానంలో మెహదీ బంగ్లా వన్డే జట్టును నడిపించనున్నాడు. "బోర్డు నాకు ఈ బాధ్యత అప్పగించడం చాలా గౌరవంగా ఉంది" అని 27 ఏళ్ల మెహిదీ బీసీబీ ప్రకటనలో తెలిపారు. 

"దేశానికి నాయకత్వం వహించడం ఏ క్రికెటర్‌కైనా ఒక కల. బోర్డు నాపై చూపిన విశ్వాసానికి నేను కృతజ్ఞుడను. ఈ జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ధైర్యంగా క్రికెట్ ఆడగల ప్రతిభ, నమ్మకం మాకు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో జట్టుకు ముందుకు సాగుతుందని.. ఎలాంటి అడ్డంకులు లేకుండా దేశం కోసం మా అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆయన మెహదీ తెలిపాడు. మార్చి 2017లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఈ బంగ్లా ఆల్ రౌండర్ ఇప్పటివరకు 105 వన్డేల్లో 1,617 పరుగులు చేయడంతో పాటు  110 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

►ALSO READ | WTC Final 2025: ఐపీఎల్‌లో అలా.. దేశానికి ఇలా: పార్టీ మార్చేసిన డివిలియర్స్

జూన్ 17 నుండి జూలై 16 వరకు శ్రీలంకలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ లు జరుగుతాయి. టెస్ట్ కెప్టెన్‌గా నజ్ముల్ హుస్సేన్ శాంటో కొనసాగనుండగా.. లిట్టన్ దాస్ టీ20ల్లో బంగ్లాదేశ్ సారధిగా ఉన్నాడు. మెహిదీ వన్డే జట్టు బాధ్యతలను స్వీకరిస్తాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలిసారి మూడు ఫార్మాట్ లను ముగ్గురు కెప్టెన్లు నడిపించనున్నారు.