మిడ్ మానేరు భూముల కబ్జా

మిడ్ మానేరు భూముల కబ్జా

నోటీసులిచ్చిన అధికారులు..కోర్టుకు వెళ్లిన ఆక్రమణదారులు

కౌంటర్ ఫైల్ దాఖలుకు ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్ణయం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు  నిర్మాణానికి ఎన్నో కుటుంబాలు సర్వం  త్యాగం చేశాయి. బోయినిపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు  ఉన్న ఇంటితోపాటు జీవనాధారమైన వ్యవసాయ భూములను మిడ్ మానేరు నిర్మాణానికి అందించారు. మన్వాడ గ్రామంలో సుమారు 1000  ఎకరాల భూమిని సేకరించి 2006లో మిడ్ మానేరు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొత్తంగా మిడ్ మానేరు  నిర్మాణానికి 19,468 ఎకరాల భూమిని సేకరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న  గ్రామాలకు కొత్త  కాలనీలు నిర్మించడానికి సుమారు 1,110  ఎకరాలు  సేకరించి ఆర్అండ్ఆర్  కాలనీలను  నిర్మించారు. ముంపునకు గురైన కుటుంబాలకు 242  చదరపు గజాల చొప్పున అధికారులు కేటాయించారు. ఇదిలా ఉండగా కాలనీలకు సేకరించిన భూములే కాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన భూములు సైతం కబ్జాకు గురవుతున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారి పై మిడ్ మానేరు ప్రాజెక్టు స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు.

ఆక్రమణదారులకు నోటీసుల జారీ

మండలంలోని నీళోజిపల్లి గ్రామానికి ఎదురుగా గ్రానైట్ ఫ్యాక్టరీ, పెట్రోల్ పంప్, సెల్ టవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇరిగేషన్ అధికారులు మిడ్ మానేరు స్థలంలో కంచె ఏర్పాటు చేసి ప్రాజెక్టు పొడవునా మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతో హద్దులు ఏర్పాటు చేశారు . అలాగే ప్రాజెక్టు పొడవునా కంచె ఏర్పాటు చేస్తున్న సమయంలో స్థలాన్ని ఆక్రమించినట్లు తెలియడంతో ఉన్నతాధికారులకు తెలిపినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆక్రమణదారులు రాజకీయ నాయకులతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మిడ్ మానేరు స్థలంలో ఏర్పాటు చేస్తున్న కంచెకు 5  మీటర్ల దూరంలోనే నిర్మాణాలు వెలిశాయి. అంతేకాకుండా మరోచోట ఏకంగా ప్రాజెక్టు స్థలంలోకే చొచ్చుకొచ్చి కట్టడాలు నిర్మించారు. దీనితో ఆ స్థలంలో కంచె ఏర్పాటును నిలిపివేశారు. మిడ్ మానేరు స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు నిర్మించిన గ్రానైట్  ఫ్యాక్టరీ, పెట్రోల్ పంప్, సెల్ టవర్ లకు నోటీసులు జారీ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు హడావిడిగా వెళ్లి కొలతలు సైతం తీశారు. స్థలం ఆక్రమణకు గురైందని తేల్చారు.  ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చి పనులను కొనసాగించారు. ప్రస్తుతం పనులు చివరిదశకు చేరుకున్నాయి. కౌంటర్ దాఖలు చేస్తున్నాం

-శ్రీకాంత్ రావు, ఎస్ఈ, మిడ్ మానేరు ప్రాజెక్టు

స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

మిడ్ మానేరు  స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే కొలతలు వేశారు. నిబంధనలు ఉల్లంఘించి వారు కట్టడాలు నిర్మించారు. వారంతా కోర్టుకు వెళ్లి స్టేటస్ కో  స్టే ఆర్డర్ ను తీసుకున్నారు.

–  ధారా ప్రసాద్, తహసీల్దార్, బోయినిపల్లి