
హైదరాబాద్, వెలుగు: మిలాద్ ఉన్ నబీ ర్యాలీపై ముస్లిం మత పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ర్యాలీని అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ నెల 28న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ జరగాల్సి ఉన్నప్పటికీ అదే రోజు గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఉండటంతో మత పెద్దలు ర్యాలీని వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం పోలీస్ ఉన్నతాధికారులు ముస్లిం మతపెద్దలతో చర్చించారు. గణేశ్ శోభాయాత్ర, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. దీంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మతపెద్దలు, పీస్ కమిటీ మెంబర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సాధ్యాసాధ్యాలపై చర్చించి తుది నిర్ణయం ప్రకటించారు.