ప్రధాని మోడీకి మూడు ప్రశ్నలు వేసిన కేటీఆర్..

ప్రధాని మోడీకి మూడు ప్రశ్నలు వేసిన కేటీఆర్..

ప్రధాని మోడీకి మరోసారి ట్విట్టర్ లో  ప్రశ్నలు సందించారు మంత్రి  కేటీఆర్.  ఇవాళ మోడీ నిజామాబాద్ కు వస్తుండటంతో మూడు ప్రశ్నలు వేశారు.  తెలంగాణకు ఇచ్చిన  ప్రధాన హామీలు, 1. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?3. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? అని  ప్రశ్నించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న మోడీ ..ఈ మూడు విభజన హామీలను నెరవేర్చేదెన్నడని నిలదీశారు.

పదేళ్ల నుంచి  హక్కులను  పాతరేసి  ఎంతకాలం ఈ అబద్ధాల జాతర కొనసాగిస్తారని మోడీని విమర్శించారు కేటీఆర్. మోడీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడని ప్రశ్నించారు.  గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ??..కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని ధ్వజమెత్తారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారని విమర్శించారు. పాలమూరుకు  జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారని.. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారన్నారు.

మీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు..140 కోట్ల భారతీయులను మోసం చేశారని విమర్శించారు కేటీఆర్.  2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అని.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు..పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అని అన్నారు.. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా. ? అని ప్రశ్నించారు.

మోడీ పసుపు బోర్డు ప్రకటన కూడా..మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు కేటీఆర్. ఎన్నికల వేళ హంగామా చేస్తున్నారని.. అమలు అయ్యేది ఎప్పుడో చెప్పాలన్నారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో...అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటో చెప్పాలన్నారు. తమ మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని చెప్పారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని అన్నారు.