
హైదరాబాద్: కరోనా క్రమంలో ఇప్పటికే బోనాలు, బక్రీద్ ఫెస్టివల్స్ సింపుల్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం పండగను కూడా నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం క్యాంప్ ఆఫీసులో వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం వేడుకలపై మంత్రి మీడియాతో మాట్లాడారు.
జన సమూహం లేకుండా పండగలను ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్ధనలు వద్దని కోరారు. పండగలను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కరోనా రూల్స్ ప్రజలు తప్పకుండా పాటించాలని సూచించారు. నిబంధనల్లో భాగంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.