- ఉత్తమ టూరిజం క్రియేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు ఇస్తాం
- తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: పర్యాటక రంగం విహార యాత్రలకే పరిమితం కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువత ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తిమంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా గురువారం హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశానికి పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైద్యారోగ్య, విద్యారంగాల బలోపేతానికి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయన్నారు. వినియోగంలో లేని హరిత హోటళ్లు, పర్యాటక భూములను ఆదాయ వనరులుగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సామాజిక చైతన్యం తీసుకు రావాలి
యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్కు, ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ ద్వారా వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరఫున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రభాత భేరి అనే సరికొత్త సామాజిక చైతన్య కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతోందని తెలిపారు.
