
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రాడార్ స్టేషన్కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పగించిందని, బీఆర్ఎస్ హయాంలోనే ఈ నేవీ రాడార్ కోసం కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. తుది దశ జీవో మాత్రమే పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫైల్ పై సంతకం పెట్టి జీవో ఇచ్చామని వెల్లడించారు.
ఇది తమ ప్రభుత్వం ప్రతిపాదించినది కాదన్నారు మంత్రి కొండా సురేఖ. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదు కాబట్టే అన్ని పరిశీలించాకే తుది అనుమతులకు పర్మిషన్ ఇచ్చామన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో రాజకీయాలు చేయొద్దని కోరారు. రాష్ట్రానికి మంచి పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఇండియన్ నేవీ తెలంగాణలో రాడార్ స్టేషన్ ను ఏర్పాటుచేయనుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది.