
- ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు తన సొంత జిల్లా ములుగు కలెక్టర్తో శనివారం ఆమె సెక్రటేరియెట్ నుంచి ఫోన్లో మాట్లాడి వరదలపై సమీక్షించారు. గోదావరి సమీప గ్రామాల ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజల రక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఎన్డీఆర్ఎఫ్ టీంలతోపాటు బోట్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. వాగులు పొంగి పొర్లే ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచి రాకపోకలను నియంత్రించాలని మంత్రి ఆదేశించారు.