సూర్యాపేట జిల్లా : గ్రేటర్ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు.. కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్లుగా BJP నేతలు వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాముల లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. కేవలం రెండు ఎన్నికలలో గెలుపుకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారని, టీఆర్ఎస్ అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మరవొద్దని హితవు పలికారు.
దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న తలసాని.. పదేపదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామంటున్న బీజేపీ నేతలకు నిజంగా… ఆ ధైర్యం ఉందా అని హెచ్చరించారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించకుంటే ప్రజలే మీ పై తిరగబడతారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసుకొనేందుకు వినియోగించాలన్నారు బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు.