ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?

ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?

‘కరోనా విషయంలో సీఎం కేసీఆర్ ను మరియు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మేం కూడా ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీలో లాక్ డౌన్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. హోం మినిష్టర్ మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నేత వీహెచ్ కరోనాను జయించి సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.

‘ప్రతిపక్ష నాయకులు కరోనాను పెద్ద భయంగా చిత్రీకరించారు. ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మల్లాగా, చెత్తలాగా తయారయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ నోటికి మొక్కాలి. ముఖ్యమంత్రి కనబడకపోతే ప్రతిపక్షాలకు వచ్చే ఇబ్బంది ఏంటీ? ప్రభుత్వం నడుస్తోంది కదా. గవర్నమెంట్ స్కీములేమైనా ఆగాయా? హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలంటే బండి సంజయ్ వెళ్లి మోదీకి చెప్పాలి. బీజేపీ వాళ్లు గాలి మీద మాట్లాడితే ఎట్లా? ప్రతిపక్ష నాయకులు సీఎంను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మేం ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు? చప్పట్లు ఎందుకు కొట్టించారు, దీపాలు ఎందుకు వెలిగించారని మేం కూడా మాట్లాడగలం. కరోనా సమయంలో బాధ్యతగా మాట్లాడాలి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలంగాణ  ప్రభుత్వం తీసుకుంటోంది. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసినందుకే తెలంగాణలో కరోనా పెరుగుతోందని మాట్లాడడం ఎంత సిగ్గుచేటు. గాలిపై మాట్లాడితే గాలిలోనే కొట్టుకుపోతారు’ అని ఆయన ప్రతిపక్షాలను విమర్శించారు.