సాగర్​ నీళ్లు దోచుకెళ్తుంటే .. మంత్రులు టైంపాస్​ చేస్తున్రు : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి

సాగర్​ నీళ్లు దోచుకెళ్తుంటే .. మంత్రులు టైంపాస్​ చేస్తున్రు : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి

 

  •  కాంగ్రెస్​ను తన్ని తరిమేసేందుకు  ప్రజలు రెడీగా ఉన్నరు 
      

నల్గొండ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ వాళ్లను తన్ని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సాగర్ నీళ్లను దోచుకుపోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ పార్లమెంట్​ బీఆర్ఎస్​ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ వేసిన ​సందర్భంగా జగదీశ్​రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్​ మంత్రులు, నాయకులు కనీస సోయి లేకుండా ఉన్నారని, వాళ్లకు సాగర్ డ్యాం మీదకు పోయే దమ్ము కూడా లేదన్నారు. పూటకో మాట మార్చే  పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైందన్నారు. 

సీఎం రేవంత్  రెడ్డి బూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు. ఇక్కడున్న  జిల్లా మంత్రిని రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నాడని, ఆయన్నే చెప్పుతో కొట్టేందుకు  రైతులు రెడీగా ఉన్నారన్నారు. రైతులకు నీళ్లివ్వలేని దద్దమ్మలు జిల్లా మంత్రులన్నారు. పదవుల కోసం నోరు మూసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్లన్నారు. తర్వాత ర్యాలీగా వెళ్లి నల్గొండ ఆర్ఓ ఆఫీసులో నామినేషన్​వేశారు.

 రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్​, జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్​కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​రెడ్డి, నల్లమోతు భాస్కర్​రావు, నోముల భగత్​, తిప్పన విజయ సింహారెడ్డి, ట్రైకార్​మాజీ చైర్మన్​ రాంచందర్​ నాయక్, నల్గొండ మాజీ మున్సిపల్​ చైర్మన్ ​మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.