మొదటి రోజు ఇంటర్ క్వశ్చన్పేపర్లలో తప్పులు రాగా చివరిరోజు కూడా అదే రిపీటైంది. సెకండియర్ కామర్స్, కెమిస్ర్టీ పేపర్లలో తప్పులు వచ్చాయి. తెలుగుమీడియంలో నిర్వహించిన కామర్స్ పేపర్లోని సెక్షన్ ఏలోని 9వ ప్రశ్నలో ‘ఎస్సీ/ఎస్టీ’లకు బదులు, ‘ఎస్సీ/ఎస్’గా వచ్చింది. అదే ప్రశ్నలో ‘తెలంగాణ’ పేరుకు బదులు ‘తెలంగాక్’ గా పడింది. కెమిస్ర్టీ తెలుగుమీడియంలో సెక్షన్ బీ లోని 12వ ప్రశ్నలో ‘మోలారిటీ’కి బదులు ‘మెలోరిటీ’ అని పడింది. సెక్షన్ సీ లోని 19వ ప్రశ్నలో ‘H2O2’ బదులు ‘H2, O2’ అని వేర్వేరుగా వచ్చింది. కెమిస్ర్టీ ఉర్దూమీడియంలో సెక్షన్ బీలోని 13 ప్రశ్నలో ‘ఇట్సాఖ్’ బదులు ‘ఇతాక్’ వచ్చింది. కాగా ఇంటర్ మేజర్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా 9.65లక్షల మంది విద్యార్థులు ఉండగా, 95.72శాతం విద్యార్థులు అటెండ్అయ్యారని చెప్పారు. మైనర్ సబ్జెక్ట్స్ తో పాటు ఒకేషనల్ఎగ్జామ్స్ఈనెల 23 వరకూ కొనసాగనున్నాయని చెప్పారు. పరీక్షలు ముగియడంతో హాస్టల్స్లో ఉంటున్న స్టూడెంట్స్ ఇంటిబాట పట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మధ్యాహ్నాం నుంచి రద్దీగా మారాయి.
రేపటి నుంచి స్పాట్..
అన్ని సబ్జెక్టులకు ఇంటర్ స్పాట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సిబ్బందికి, లెక్చరర్లకు గురువారం ట్రైనింగ్ఇవ్వనున్నారు. 10వ తేదీ నుంచే సంస్కృతం వాల్యుయేషన్ షురూ అయ్యింది.
436 మాల్ ప్రాక్టీస్ కేసులు
మార్చి 4 నుంచి ప్రారంభమైన ఇంటర్పరీక్షల్లో మొత్తం 436 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఫస్టియర్లో 116, సెకండియర్లో 320 కేసులు నమోదు చేశారు. చివరిరోజైన బుధవారమే 60 కేసులు బుక్ చేశారు. అత్యధికంగా ఈనెల11న జరిగిన సెకండియర్ మ్యాథ్స్ఏ, బాటనీ, సివిక్స్పరీక్షల్లో ఏకంగా 90 మందిపై మాల్ ప్రాక్టీస్కేసులు పెట్టారు. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.