- సీడీపీ నిధుల కొరత
- గత బడ్జెట్లో ఊసేలేదు.. ఈ బడ్జెట్లోనైనా కేటాయించేనా?
ఏ ఊళ్లెకు పోయినా ఎవలు ఉర్కొచ్చి నిలదీత్తరోనని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బుగులు పట్టుకుంది. జనం ఏమడుగుతరోనని, ఏ పన్జేయమంటరోనని పరేషాన్ అయితున్రు. పేరుకే ఎమ్మెల్యేలమని, సీడీపీ ఫండ్స్ రాక ఊర్లల్ల మొఖం చెల్తలేదని రంధి పడ్తున్రు. తమకాడ పైసల్లేకపోయెసరికి ఆఖరికి గల్లీ లీడర్లు కూడా మాట వింటలేరని ఎమ్మెల్యేలు నారాజ్ అయితున్రు.
హైదరాబాద్, వెలుగు: ఏటా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) కింద ఇచ్చే నిధులను గత బడ్జెట్లో రాష్ట్ర సర్కారు కేటాయించలేదు. రేపోమాపో అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2020–21 బడ్జెట్లో కూడా అదే రిపీట్ అయితే పరిస్థితి ఏందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు ఊళ్లలో పర్యటించినప్పుడు అక్కడి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు సీడీపీ నిధులు ఉపయోగపడుతుంటాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ ఊసే లేదు. ఊళ్లలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటూ జనం నిలదీస్తున్నారు. సీడీపీ ఫండ్స్ ఉంటే కొన్ని సమస్యలనైనా పరిష్కరించేవాళ్లమని, ఫండ్స్ లేకపోవడంతో 14 నెలల నుంచి ఊళ్లలో సరిగ్గా తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని సందర్భం దొరికిన ప్రతిసారీ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. తమ తొలి ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా బిల్లులు రావడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు.
14 నెలల్లో పైసా పని జేయలే!
రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ఈ కాలంలో ఊళ్లలో తాము పైసా పనిచేయలేకపోయామని ఎమ్మెల్యేలు అంటున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు చేసిన పనులు తప్ప కొత్తగా ఏ పనికి శ్రీకారం చుట్టలేదని చెబుతున్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ముందు చాలా పనులకు శంకుస్థాపనలు చేశామని, అవన్నీ కూడా టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన పనులకు తిరిగి కొబ్బరి కాయలు కొట్టడం లాంటివని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ సారి బడ్జెట్ లో సీడీపీ కింద నిధులు కేటాయించకపోతే జనంలో ముఖ్యంగా పార్టీ లోకల్ క్యాడర్లో ఎమ్మెల్యేలు చులకనవుతారని ఆయన అన్నారు. సీడీపీ నిధులుంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడి సమస్యల పరిష్కారానికి వెంటనే నిధులను సాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పనుల్లో కొన్నయినా నామినేషన్ పద్ధతిన తమ అనుచరులకు, క్యాడర్కు కేటాయించి వారిని సంతృప్తి పరిచే అవకాశం కూడా ఎమ్మెల్యేలకు ఉంటుంది.
మర్యాద ఇస్తలేరు
సీడీపీ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలకు కార్యకర్తలు, లోకల్ లీడర్లు మర్యాద ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే పర్యటన ఉందంటేనే లోకల్ లీడర్లు తప్పించుకుని తిరిగే పరిస్థితి ఉందని ఓ సీనియర్ ఎమ్మెల్యే అన్నారు. ‘‘ఎమ్మెల్యేల దగ్గర పైసల్లేవు. ఆయన ప్రోగ్రాంలకు పోవుడ దండుగ. మాకు చిన్న పని కూడా ఇవ్వడు. ఎందుకు పోవుడు’’ అనే అభిప్రాయం గ్రౌండ్ లెవల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కార్యకర్తలు చిన్న చిన్న పనులు అడిగితే నిధులు లేవని చెప్పాలంటే నామోషీ అవుతోందని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అన్నారు.
నాడు రూ. 3 కోట్లు జేసి.. మరి ఇప్పుడు ?
ఉమ్మడి రాష్ట్రంలో సీడీపీ కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ. కోటి నిధులు ఇచ్చేవారు. అయితే 2015లో సీఎం కేసీఆర్ దాన్ని రూ. కోటిన్నరకు చేర్చారు. 2016–-17లో ఏకంగా రూ. 3 కోట్లు చేశారు. అయితే.. మళ్లీ అధికారంలోకి రాగానే మరిన్ని నిధులు ఇస్తారని ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. తీరా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని 2019–20 బడ్జెట్ లో పైసా కూడా కేటాయించలేదు.
పాత బిల్లులు ఇంకా ఇవ్వలే
2018 సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దుకు ముందు ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున పనులను మంజూరు చేశారు. సీఎం పరిధిలోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తోపాటు సీడీపీ కింద చాలా పనులు చేపట్టారు. ఆ పనులన్నీ పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. నిధులు మాత్రం ఇంకా ఇవ్వడం లేదని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు. ‘నాకు తెల్సిన కాంట్రాక్టర్ కు రూ. 80 లక్షల రోడ్డు పని వచ్చింది. పని పూర్తయి ఏడాదిన్నర అయినా బిల్లు రాలేదు. బయటికి చెప్పితే ఇజ్జత్ పోతది’ అని తెలిపారు.