కళ తప్పిన ఒగ్గు కళ: ఉద్యమ సమయంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు

కళ తప్పిన ఒగ్గు కళ: ఉద్యమ సమయంలో ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు

జనాలను చైతన్యపరిచే వారి దరువు మూగబోయింది. డప్పు, గజ్జల సప్పడు స్వరూపమే మారిపోయింది. అసలే నయా టెక్నాలజీకి తట్టుకోలేక ఉపాధిని కోల్పోతున్న వారికి…కరోనా తోడైంది. దీంతో ఏళ్ల తరబడి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కరోనాతో కళ తప్పిన ఒగ్గు కళపై ప్రత్యక కథనం. ఒకరు పాట పాడితే మరొకరు కవిత చదవడం.. ఇంకొందరు వాయిద్యాలు వాయిస్తూ కథల ద్వారా కళారూపాన్ని ప్రదర్శించడం.. ఒగ్గు డోలు కళాకారులకే సొంతమైన ప్రత్యేకమైన కళ. కరోనాతో ఈ కళనే నమ్మిన వారి జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆరు నెలలుగా పనులు లేక పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ కారణంగా తమకు బతుకు దెరువు కష్టమైందని వాపోతున్నారు కళాకారులు.

పూర్వం నుంచి ఒగ్గుకథకు ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా…తాత ముత్తాతల నుంచి ఒగ్గు కథ నేర్చుకుని జీవిస్తున్నామంటున్నారు కళాకారులు. కరోనాతో తమకు పనిలేకుండా పోయిందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డోలు శబ్ధాలతో మద్దతు తెలిపినా… ఇప్పుడు ఆదరణ లేదంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ తమకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని వాపోతున్నారు. కరోనా టైంలో ఇబ్బందులు పడుతున్న తమకు వెంటనే సాయం అందించాల్సిందిగా కోరుతున్నారు.

ఒగ్గు కథ, కళ్యాణం జరిపించేందుకు దాదాపు 8 మంది అవసరం అవుతారంటున్నారు కళాకారులు. కథ చెప్పినందుకు 5 నుంచి 10 వేలు వస్తాయనీ.. ఇందులో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయాలు కూడా మిగలవంటున్నారు. అయినా కులవృతినే నమ్ముకున్నట్టు చెప్పారు. గతంలో పెళ్ళిళ్ళు, ఆలయాల్లో బోనాలు, శివశక్తుల ముందు డోలు వాయించడం లాంటివి ఉండేవనీ.. ఉగాది మొదలు మూడు నెలల పాటు వచ్చే ఆదాయంతోనే ఏడాదంతా గడిపేవారమంటున్నారు. ఇదే సమయంలో కరోనా రావడంతో తమను పిలిచే వాళ్ళే లేరంటున్నారు. ఒగ్గు కథ, కళాకారులు అంతరించిపోకుండా ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు కళాకారులు.